Site icon HashtagU Telugu

Indus Waters Treaty : సింధు జల ఒప్పందంపై పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్

ajay banga

ajay banga

Indus Waters Treaty : భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారత సరిహద్దు ప్రాంతాలపై పాక్ ఆర్మీ దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ను అన్నివిధాల దెబ్బకొట్టేందుకు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్థిక మూలాలను టార్గెట్ చేయడంతోపాటు.. పాకిస్తాన్‌తో 1960 సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. అయితే, భారతదేశానికి ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు లేదని, ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఒప్పందాన్ని నిలిపివేయాలనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని భారతదేశంపై ఒత్తిడి చేయగలదని పాకిస్తాన్ నిపుణులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

Also Read : Operation Sindoor : అగ్నివీర్ చనిపోతే.. కేంద్రం ఎంత పరిహారం ఇస్తుందంటే..!!

ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా భారత్ పర్యటనలో ఉన్నారు. గురువారం ప్రధానితో భేటీకాగా.. ఇవాళ యూపీ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా.. సింధూ జల ఒప్పందాన్ని భారత్ నిలిపివేడయంపై అజయ్ బంగా స్పందించారు. ‘‘ఈ ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకొని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవన్నీ అర్ధంలేనివి. ప్రపంచ బ్యాంక్ పాత్ర కేవలం మధ్యవర్తిత్వం వహించడమే. అంటే సహాయకుడిగా మాత్రమే ఉంటుంది.’’ అని స్పష్టం చేశారు.

Also Read : DDCA Threat Email: ఢిల్లీ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపు!

అజయ్ బంగా భారతీయ మూలాలు కలిగిన సిక్కు అమెరికన్. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. ఇదిలాఉంటే.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్‌ మూడురోజుల క్రితం చీనాబ్‌ నది నుంచి పాక్‌కు వెళ్లే జలాలకు అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్‌లోకి ప్రవహించే చీనాబ్‌ నదీ జలాలను నియంత్రించే బాగ్లిహార్‌, సలాల్‌ డ్యాంల గేట్లను భారత ప్రభుత్వం మూసివేసింది. జమ్మూ కశ్మీరులోని రియాసీ జిల్లాలో ఉన్న సలాల్‌ డ్యామ్‌ గేట్లన్నీ మూసివేయడంతో దిగువ ప్రాంతాలలో నీటి ప్రవాహ స్థాయి పడిపోవడంతోపాటు చాలా చోట్ల నది ఎండిపోయినట్లు తెలుస్తోంది. బాగ్లిహార్‌ డ్యామ్‌ గేట్లను మూసివేయడంతోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. మరో ప్రధాన నది జీలం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు నిర్మించిన కిషన్‌గంగా డ్యాం వద్ద కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. దీంతో భారత్ బిగిస్తున్న ఉచ్చుకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోతుంది.