Adani Group : దేశంలోని విమానాశ్రయాలు, పోర్టులను కొనే రేసును అదానీ గ్రూప్ కొనసాగిస్తోంది. తాజాగా ఒడిశాలోని గోపాల్పుర్ పోర్టును రూ.3,350 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ నుంచి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈవిషయాన్ని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. 2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్పీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ పోర్ట్లో ‘గ్రీన్ఫీల్డ్ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్’ ఏర్పాటుకు ఇటీవలే ‘పెట్రోనెట్ ఎల్ఎన్జీ’తో ఒప్పందం కూడా చేసుకుంది. ఇంతలోనే నిధుల కొరత కారణంగా 20 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన గోపాల్పుర్ పోర్టును అదానీ గ్రూప్కు(Adani Group) అమ్మేసింది.తొలిసారిగా మహారాష్ట్రలోని ధరమ్తర్ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్కు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసిన జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా.. వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది.
We’re now on WhatsApp. Click to Join
గత కొన్ని నెలలుగా దేశంలోని నౌకాశ్రయాల నుంచి షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ పెట్టుబడులను క్రమంగా ఉపసంహ రించుకుంటోంది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్లకు దీన్ని అమ్మేసినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. అప్పులను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ పెట్టుబడి ఉపసంహరణలు తమకు ఉపయోగపడతాయని ఎస్పీ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. దీని వల్ల భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎస్పీ గ్రూప్కు ఉన్న కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుందన్నారు. ఎస్పీ గ్రూప్పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని అంచనా.
Also Read : Kavitha : తిహార్ జైలుకు కవిత.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
దేశంలోని అదానీ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్
- గంగవరం పోర్ట్ – ఆంధ్రప్రదేశ్
- కరైకల్ పోర్ట్ – పుదుచ్ఛేరి
- కృష్ణపట్నం పోర్ట్ – ఆంధ్రప్రదేశ్
- ముంద్రా పోర్ట్ – గుజరాత్
- ట్యూనా టెర్మినల్ – గుజరాత్
- దహేజ్ పోర్ట్ – గుజరాత్
- హజీరా పోర్ట్ – గుజరాత్
- మోర్ముగో పోర్ట్ – గోవా
- విజింజిం పోర్ట్ – కేరళ
- కట్టుపల్లి పోర్ట్ – తమిళనాడు
- ఎన్నూర్ టెర్మినల్ – తమిళనాడు
- ధమ్రా పోర్ట్ – ఒడిశా
- దిఘీ పోర్ట్ – మహారాష్ట్ర