రెండున్న దశాబ్దాల బీజేపీ ప్రస్తానాన్ని గుజరాత్ లో ఆపడానికి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని దింపడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా గుజరాత్ వెళ్లిన ఆయన మీడియాను బీజేపీ భయపెడుతోందని అన్నారు. అందుకే, సోషల్ మీడియాను నమ్ముకోవడం ద్వారా ఆప్ ప్రచారం ఉండాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
ఓడిపోతామనే భయంతోనే ఆప్ నాయకులపై బీజేపీ దాడులు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడులు గుజరాత్ లో పెరిగిన గుండాయిజాన్ని బహిర్గతం చేస్తుందని అన్నారు. అక్కడి ఆప్ నేత మనోజ్ సోరథియాపై దాడి గురించి తెలుసుకున్న ఆరు కోట్ల మంది గుజరాత్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ` దేవుని ముందు అతని తల పగులగొట్టారు. ఇది మన దేశ సంస్కృతి కాదు. ఇది హిందూ సంస్కృతి కాదు. ఇది గుజరాత్ సంస్కృతి కాదు` అంటూ రాజ్కోట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ అధినేత అన్నారు.
“దాడి జరిగినప్పటి నుండి సూరత్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మేము సూరత్లో ఒక సర్వే చేసాము మరియు 12 సీట్లలో ఏడు AAP గెలుచుకుంటుందని కనుగొన్నాము” అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ‘ఆరతి’ చేయనున్నట్లు ప్రకటించారు. పంజాబ్ తరహా ఫార్ములాతో గుజరాత్ లోనూ ఆప్ జెండా ఎగురవేయాలని కేజ్రీవాల్ ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వరకు ఆయన ప్రయత్నం ఫలిస్తుందో చూడాలి.