Site icon HashtagU Telugu

Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!

Hayli Gubbi Volcano

Hayli Gubbi Volcano

ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్‌తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత మొదటిసారి బదలైంది. నవంబరు 23న జరిగిన భారీ విస్ఫోటం కారణంగా పెద్దఎత్తున బూడిద, పొగలు కక్కుతూ ఇది లావా విరజిమ్ముతోంది. బూడిద కొన్ని వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో భారత సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. ఉత్తర ఇథియోపియాలోని హేలీ గుబ్బీ అగ్నిపర్వతం బద్దలవడంతో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా భారత్ సహా పలు దేశాలను భారీగా బూడిద కమ్మేసింది. ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీ పరిసరాలకు ఈ బూడిద చేరుకుంది. దీంతో విమాన రాకకపోలకు అంతరాయం ఏర్పడింది.

సోమవారం తొలుత గుజరాత్‌లోకి ప్రవేశించిన ఈ బూడిద క్రమంగా రాజస్ధాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లకు చేరింది. బూడిద మేఘాలు చైనావైపుగా పయనిస్తున్నాయని, రాత్రి 7.30 గంటల తర్వాత భారత గగనతలం నుంచి దూరంగా వెళ్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ‘‘అధిక తీవ్రత గాలులు ఇథియోపియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వరకు.. అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ, ఉత్తర భారతదేశం వైపు బూడిద మేఘాలను మోసుకెళ్లాయి’’ అని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు జారీచేసింది. అగ్నిపర్వత బూడిత ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేయాలని, తాజా సూచనలకు అనుగుణంగా ప్రయాణ ప్రణాళిక, రూటింగ్, ఇంధన పరిమితిని సర్దుబాటు చేయాలని కోరింది. ఈ ప్రభావం ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు సంస్థల సర్వీసులపై పడింది.

హేలి గుబ్బీ అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత కొన్ని ప్రాంతాలకు ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా 11 విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. రద్దయిన వాటిలో నెవార్క్- న్యూఢిల్లీ, న్యూయార్క్- న్యూఢిల్లీ, దుబాయ్- హైదరాబాద్, దోహా- ముంబి, దుబాయ్- చెన్నై, దమామ్ (సౌదీ)- ముంబి, దోహా-ఢిల్లీ, చెన్నై- ముంబయి, హైదరాబాద్- ఢిల్లీ విమానాలు ఉన్నాయి.

ఊహించని పరిస్థితుల వల్ల ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కానీ, ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకే మా అత్యున్నత ప్రాధాన్యత’ అని ఎయిరిండియా ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొంది. ఇండిగో సైతం ప్రయాణీకుల భద్రత కోసం అవసరమైన చర్యలతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఈ ధూళిలో ఎక్కువ మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్, మితమైన సాంద్రత కలిగిన అగ్నిపర్వత బూడిద ఉంటుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ‘‘ఇది వాయు నాణ్యత సూచిక స్థాయిలను ప్రభావితం చేయదు.. కానీ నేపాల్, హిమాలయాలు, ఉత్తరప్రదేశ్‌ పక్కనే ఉన్న టెరాయ్ బెల్ట్‌లోని కొండలలో SO2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది.. ఎందుకంటే కొన్ని పదార్థాలు కొండలను ఢీకొట్టి తరువాత చైనాలోకి ప్రవేశిస్తాయి’’ అని చెప్పారు.

హేలి గుబ్బీ అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత పొగ, బూడిద నింగిలోకి 14 కిలోమీటర్ల ఎత్తునకు చేరుకుని, అనేక గ్రామాలపై ఆవరించింది. దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం , రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే తీవ్ర భౌగోళిక కార్యకలాపాల జోన్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది.

Exit mobile version