1st Accused :ఈరోజు నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు మనదేశంలో అమల్లోకి వచ్చాయి. అయితే ఈ చట్టాల ప్రకారం దేశంలోనే తొలి కేసు ఎక్కడ నమోదైందో తెలుసా ? మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నమోదైంది. ధ్వంసానికి సంబంధించిన ఓ ఘటనపై భోపాల్లోని నిషాత్పురా పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. అర్ధరాత్రి 12:05 గంటలకు దాడి జరగగా.. తెల్లవారుజామున 12:20 గంటలకు కొత్త చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. భైరవ్ సాహు అనే వ్యక్తి తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టంలోని సెక్షన్ 115 కింద దాడి, సెక్షన్ 296 కింద అసభ్యకర ప్రవర్తన, సెక్షన్ 119 కింద అల్లరి చేయడం వంటి సెక్షన్లను నిందితుడిపై నమోదు చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉండేవారిపై ఐపీసీలోని సెక్షన్ 323 కింద దాడి, సెక్షన్ 294, సెక్షన్ 327 కింద కేసులు పెట్టేవారు.
We’re now on WhatsApp. Click to Join
ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ శుక్రవారం తెల్లవారుజామునే కొత్త నేర,న్యాయ చట్టాల ప్రకారం ఓ కేసు నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్బ్రిడ్జికి అడ్డంగా తోపుడు బండిని పెట్టుకున్నందుకు ఓ చిరువ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అతడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనల ప్రకారం కేసును నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. బీఎన్ఎస్లోని సెక్షన్ 285 ప్రకారం సదరు చిరువ్యాపారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సదరు చిరువ్యాపారి తప్పు ఉన్నట్లుగా రుజువు అయితే.. అతడిపై దాదాపు రూ.5వేల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. సోమవారం తెల్లవారుజామున 12:15 గంటలకు ఆ చిరువ్యాపారిపై కేసును నమోదు చేశామని ఢిల్లీ పోలీసు వర్గాలు(1st Accused) వెల్లడించాయి.
‘‘ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అడ్డంగా పెట్టిన తోపుడు బండిని తొలగించాలని పెట్రోలింగ్ పోలీసులు సూచించినా సదరు చిరువ్యాపారి వినిపించుకోలేదు. దీంతో ఆ చిరువ్యాపారిపై సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని తెలిపారు. కాగా, ఈ రోజు నుంచి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టాలను భారత పార్లమెంటులో 2023 డిసెంబర్ 21న ఆమోదించింది. దాన్ని 2023 డిసెంబర్ 25న రాష్ట్రపతి ఆమోదించారు. అదే రోజు అధికారిక గెజిట్ కూడా విడుదలైంది.