Hajj Pilgrims : సౌదీ అరేబియాలో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. బుధవారం వరకు దాదాపు ఐదు రోజుల పాటు హజ్ యాత్ర జరిగిన మక్కా నగరంలో రోజూ సగటున 50 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఈ ఎండలు, వడగాలుల ధాటికి దాదాపు 650 మంది హజ్ యాత్రికులు మక్కా నగరంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 68 మందే ఇండియన్స్ అని బుధవారం రాత్రి వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా గురువారం ఉదయం మరో కొత్త అప్డేట్ వచ్చింది. చనిపోయిన భారతీయ హజ్ యాత్రికుల సంఖ్య 90కిపైనే ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వివరాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం కానీ.. భారత ప్రభుత్వం కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join
చనిపోయిన వారిలో దాదాపు 320 మంది ఈజిప్టు దేశీయులు, 60 మంది జోర్డాన్ దేశస్తులు ఉన్నారు. ట్యునీషియాకు చెందిన పలువురు హజ్ యాత్రికులు(Hajj Pilgrims) కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలు ధ్రువీకరించాయి. అయితే ఇప్పటికీ భారత సర్కారు నుంచి దీనిపై ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్రకు వెళ్లారు. వీరిలో 16 లక్షల మంది 22 దేశాలవారే. మిగతా 2 లక్షల మంది మాత్రమే సౌదీ అరేబియా స్థానిక హజ్ యాత్రికులు.