Tillu Tajpuriya murder : జైలులోకి కత్తులు ఎలా వచ్చాయి ? జైలు అధికారులపై హైకోర్టు ఆగ్రహం

తీహార్ జైలులో మే 2న జరిగిన గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు తాజ్‌పురియా (33) దారుణ హత్య(Tillu Tajpuriya murder)ను ఆపడంలో విఫలమయ్యారని జైలు అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 05:51 PM IST

తీహార్ జైలులో మే 2న జరిగిన గ్యాంగ్‌స్ట‌ర్ టిల్లు తాజ్‌పురియా (33) దారుణ హత్య(Tillu Tajpuriya murder)ను ఆపడంలో విఫలమయ్యారని జైలు అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిల్లుపై దాడి జరిగినప్పుడు(Tillu Tajpuriya murder) తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. “తాజ్‌పురియాపై దాడి చేస్తున్న వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదు. పోలీసులు వెనక్కి వెళ్లడం వీడియోలో కనిపించింది” అని జస్టిస్ జస్మీత్ సింగ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని జైలు యంత్రాంగాన్ని ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. జైలులోని సీసీటీవీ కెమెరాల్లో ఘటన మొత్తం రికార్డ్ అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో కోర్టు అర్థం చేసుకోలేకపోతోందని జస్టిస్ జస్మీత్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు. జైలు కాంప్లెక్స్ లోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ” దాడికి పాల్పడిన వ్యక్తులు ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి కత్తులు తయారు చేసి.. బెడ్‌షీట్‌లను ఉపయోగించి టిల్లు తాజ్‌పురియా సెల్ లోకి దూకి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ” అని పోలీసు వర్గాలు కోర్టుకు తెలిపాయి.

also read : Tillu Tajpuriya : తీహార్ జైల్ గ్యాంగ్ వార్.. ఏకంగా 100 సార్లు పొడిచి చంపారు.. సీసీటీవీలో నమోదు..

తాజ్‌పురియాను అతని సెల్ నుంచి బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి చంపిన సీసీటీవీ ఫుటేజీని జస్టిస్ జస్మీత్ సింగ్ విచారణ సందర్భంగా కోర్టులో చూశారు. అనంతరం స్పందిస్తూ.. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో జరిగిన ఘటనకు బాధ్యులైన అధికారుల గురించి తమకు తెలియజేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. తాజ్‌పురియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తాజ్‌పురియా తండ్రి, సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఈసందర్భంగా కోర్టు విచారించింది. భద్రత కల్పించడాన్ని పరిశీలించాలని ఢిల్లీ పోలీసులకు జస్టిస్ జస్మీత్ సింగ్ సూచించారు. కాగా, 2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లో గ్యాంగ్‌ స్టర్‌ జితేందర్‌ గోగిని హత్య చేయడం వెనుక టిల్లు తాజ్‌పురియా హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మే 2న తీహార్ జైలులో పదునైన ఆయుధాలతో ప్రత్యర్థి ముఠా సభ్యులు అతడిని పొడిచి చంపారు. ఈ హత్యలో నలుగురు ఖైదీల ప్రమేయం ఉందని నిర్ధారించారు. ఈ నలుగురూ గోగీ గ్యాంగ్‌ సభ్యులే.