Site icon HashtagU Telugu

Maharashtra: మహారాష్ట్ర ఆలయంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు భక్తులు మృతి

Maharashtra

Resizeimagesize (1280 X 720) (1)

మహారాష్ట్ర (Maharashtra)లోని అకోలా జిల్లాలో ఈదురుగాలులు, వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. బాలాపూర్ తహసీల్‌లోని పరాస్ ప్రాంతంలోని బాబూజీ మహారాజ్ ఆలయ సముదాయం టిన్ షెడ్‌పై వేప చెట్టు పడింది. దీంతో షెడ్డు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించారు. సుమారు 30 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం అకోలా జిల్లా బాలాపూర్ తహసీల్‌లోని పారాస్ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గాయపడిన వారు అకోలా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పాటు శిథిలాలను తొలగించేందుకు జేసీబీ, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను కూడా తరలించారు. అయితే బలమైన గాలి, వర్షం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. ఘటనాస్థలికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా గుమిగూడారు. ప్రజలు తమ వారిని వెతుకుతూ ఏడుస్తూ అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు.

Also Read: Corona: కరోనా మహమ్మారి తర్వాత పెరిగిపోయిన దీర్ఘకాలిక వ్యాధులు.. అవేంటంటే?

ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి సుమారు 40 మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. అకోలా జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో భక్తులు బాబూజీ మహారాజ్ మందిర్ సంస్థాన్‌లో గుమిగూడారు. ఈ గాలివాన కారణంగా ఆలయ సమీపంలోనే ఉన్న భారీ వేప వృక్షం కూలిపోయింది. సుమారు 40 మంది అక్కడ గుమిగూడారని అకోలా కలెక్టర్ నీమా అరోరా తెలిపారు. 36 మందిని సజీవంగా బయటకు తేగలిగామని, నలుగురు మరణించారని వివరించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని అన్నారు. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మృతుల సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణయించినట్టు తెలిపారు.