పశ్చిమ బెంగాల్ (West Bengal)లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏడుగురు చిన్నారులు మరణించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మంది అడెనోవైరస్తో మరణించారని, వారిలో ఎనిమిది మందికి కో-మోర్బిడిటీలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, గత 24 గంటల్లో మరణాలకు అడెనోవైరస్ కారణమని చెప్పలేదు. ప్రస్తుత సీజన్లో ఈ ఇన్ఫెక్షన్లు (ARIలు) సాధారణమేనని పేర్కొంది. రాష్ట్ర ఆరోగ్య అధికారులు కూడా “ప్రస్తుతం వైరల్ అంటువ్యాధికి ఆధారాలు లేవు” అని చెప్పారు.
పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 600 మంది పీడియాట్రిషియన్లతో 121 ఆసుపత్రుల్లో 5,000 పడకలను సిద్ధంగా ఉంచామని పరిపాలన తెలిపింది. గత 24 గంటల్లో కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలానీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులు మరణించారని అధికారి తెలిపారు. రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్ఐ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. “వివిధ వైరస్ల వల్ల వచ్చే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు (ARIలు) ఒక సాధారణ కాలానుగుణ సమస్య. అయితే, గత సంవత్సరాల్లో (2021, 2022) అడెనోవైరస్ల వల్ల కాలానుగుణ జ్వరం పెరగడంతో ప్రస్తుత సంవత్సరంలో ARI ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read: US Sanctions On China: చైనాపై మరోసారి అమెరికా ఆంక్షలు..?
ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీని తర్వాత ప్రభుత్వం అనేక ఆదేశాలు జారీ చేసింది. 24×7 అత్యవసర హెల్ప్లైన్ 1800-313444-222ను ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ డాక్టర్ బిసి రాయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ సైన్సెస్ని సందర్శించి మౌలిక వసతుల సన్నద్ధతను సమీక్షించి సిసియు, జనరల్ వార్డుల్లో పడకల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. 0-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సంక్రమణకు ఎక్కువగా గురవుతారు. పెద్ద పిల్లలు వైరస్ బారిన పడే అవకాశం తక్కువగా ఉన్నందున, చాలా సందర్భాలలో ఇంట్లోనే చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు. పిల్లలలో, అడెనోవైరస్లు సాధారణంగా శ్వాసకోశ, ప్రేగులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.