Ram Lalla : జనవరి 22న మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించిన కీలక విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం వెల్లడించారు. ఆ రోజున అయోధ్య రామమందిరం గర్భగుడిలో స్వచ్ఛమైన తెల్లటి మకరానా పాలరాతితో తయారు చేయించిన బాల రాముడి (రామ్లల్లా) విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆయన తెలిపారు. 51 అంగుళాల పొడవు ఉండే ఈ విగ్రహం.. ఐదేళ్ల బాలరాముడిని ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పారు. ఇందుకోసం బాలరాముడి విగ్రహానికి సంబంధించిన మూడు డిజైన్లను తయారు చేయించామన్నారు. వాటిలో అత్యుత్తమంగా కనిపించే ఒక విగ్రహాన్ని(Ram Lalla).. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు త్వరలోనే ఎంపిక చేస్తామని వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య రామమందిరం నిర్మాణం గురించి చంపత్ రాయ్ వివరిస్తూ.. ‘‘ఆలయం నిర్మాణం కోసం పెద్దమొత్తంలో 22 లక్షల క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు. గత 100-200 సంవత్సరాలలో ఇంత పెద్ద రాతి కట్టడాన్ని దేశంలో నిర్మించడం ఇదే తొలిసారి’’ అని చెప్పారు. ఇంజనీర్లు రూపొందించిన 56 పొరల కృత్రిమ శిలలను ఆలయం పునాదిగా వాడారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణకు చెందిన 17000 గ్రానైట్ బ్లాకులతో కూడిన పునాదిని భూమి నుంచి 21 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల క్యూబిక్ అడుగుల పింక్ కలర్ రాయిని రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి తెప్పించి ఆలయ నిర్మాణానికి వాడామన్నారు. ఆలయ గర్భగుడిని స్వచ్ఛమైన తెల్లని మకరానా పాలరాయితో తయారు చేశామని తెలిపారు.
అయోధ్య రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తయ్యాయని చంపత్ రాయ్ తెలిపారు. ఆలయం మొదటి అంతస్తు ఇంకా నిర్మాణ దశలోనే ఉందని చెప్పారు. ఆలయంలోని తీర్థయాత్ర సౌకర్యాల కేంద్రం (PFC) వద్ద 25,000 మంది యాత్రికుల కోసం లాకర్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. PFC సమీపంలో ఒక చిన్న ఆసుపత్రిని కూడా భక్తుల సౌకర్యార్ధం నిర్మించనున్నట్లు వెల్లడించారు. పవర్హౌస్ నుంచి నేరుగా ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్ అయోధ్య రామమందిరానికి ఉంటుందన్నారు.