ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా (5 Dead), 10 మందికి పైగా గాయపడ్డారు. చౌకీ రాజాపూర్ పరిధిలోని పాంగి ఖుర్ద్ గ్రామంలోని బహ్రైచ్ రహదారిపై కారు- స్కూటీ ఢీకొన్నట్లు చెబుతున్నారు. అనంతరం స్థానికులు వారికి సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ఒక వైపు వీరు సహాయం చేస్తుండగా ఓ భారీ ట్రక్కు ఒకటి అటు వైపుగా వచ్చింది. అదుపుతప్పిన ఆ ట్రక్కు అక్కడ సహాయం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. లఖింపూర్ ఖేరీ-బహ్రైచ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో భారీ పోలీసు బలగాలు కూడా సంఘటన స్థలంలో ఉన్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.
#UPCM @myogiadityanath ने जनपद लखीमपुर खीरी में सड़क हादसे में हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
मुख्यमंत्री जी ने दिवंगत आत्मा की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) January 28, 2023
సిఎం కార్యాలయ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. జిల్లా లఖింపూర్ ఖేరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సిఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు పరిహారం అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: Earthquake: ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ గణేష్ సాహా ప్రమాదం గురించి విలేకరులకు సమాచారం అందించగా.. ఇక్కడ చాలా బాధాకరమైన సంఘటన జరిగిందని తెలిపారు. స్కూటీ, కారు ఢీకొన్నాయి. వారిని కాపాడేందుకు కొందరు స్థానికులు వచ్చారు. బహ్రైచ్ నుంచి వస్తున్న ట్రక్కు అదుపు తప్పి సహాయం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం అందగా, మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాఫిక్ జామ్ ఏర్పడినా ప్రస్తుతం పరిస్థితి మామూలుగా మారింది. ట్రక్కు ఎలా అదుపు తప్పిందనేది విచారణలో ఉంది.