Flights Cancelled : భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు..ఎందుకంటే !!

Flights Cancelled : దేశవ్యాప్తంగా మొత్తం 48 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది

Published By: HashtagU Telugu Desk
48 Flights Cancelled

48 Flights Cancelled

ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel war) మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం ప్రభావం భారత్‌(India)పై కూడా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాలు తమ గగనమార్గాలను తాత్కాలికంగా మూసివేయడంతో, భారత పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 48 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. వీటిలో 28 విమానాలు న్యూఢిల్లీకి రావాల్సినవిగా, 20 విమానాలు అక్కడి నుండి బయలుదేరాల్సినవిగా ఉన్నట్లు వివరించింది.

రద్దు చేసిన విమానాల్లో ఎయిర్ ఇండియాకు చెందినవి 17 కాగా, ఇండిగోకి చెందినవి 8, మిగిలిన 3 ఇతర సంస్థలకు చెందినవిగా వెల్లడించారు. మధ్యప్రాచ్య గగనతలాన్ని దాటి వచ్చే విమానాలకు గమన మార్గాలు చాలా ముఖ్యం కావడంతో ఈ రద్దులు అనివార్యమయ్యాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాల గగనతలాన్ని ఉపయోగించే చాలా విమానాలపై ఇది ప్రభావం చూపించింది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనితో మళ్లీ గగనతలాలు తెరుచుకోనున్నాయి. ఈ పరిణామం నేపథ్యంలో విమాన సర్వీసులు క్రమంగా పునరుద్ధరించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులకు విమాన సర్వీసుల గురించి తాజా సమాచారం అందించేందుకు తమ వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లను చూడాలని సూచించింది. యుద్ధ వాతావరణం ముగియడంతో త్వరలోనే సాధారణ స్థితికి విమానయాన రంగం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Last Updated: 24 Jun 2025, 12:16 PM IST