శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్నాథ్ షిండే మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. తర్వాత తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
ఎమ్మెల్యేలు సూరత్ నుండి ఇక్కడికి చేరుకున్నారు. అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన మూడు బస్సులలో హోటల్కు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉదయం శివసేన రెబల్ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. హోటల్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలను మంగళవారం ముంబై నుంచి సూరత్కు తీసుకెళ్లారని, భద్రతా కారణాల దృష్ట్యా వారిని గౌహతికి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.