Delhi Storm : ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలాయి. ఈ ఎఫెక్టుతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఢిల్లీకి వెళ్లే 9 విమానాలను ఎయిర్ పోర్టు అధికారులు జైపూర్కు దారి మళ్లించారు. చెట్లు కూలిన ఘటనలకు సంబంధించిన 152 ఫిర్యాదులు, భవనాలు కూలిన ఘటనలకు సంబంధించిన 55 ఫిర్యాదులు, విద్యుత్తు అంతరాయానికి సంబంధించిన 202 ఫిర్యాదులు ఢిల్లీ పోలీసులకు వచ్చాయి. నోయిడాలోని సెక్టార్ 58లో భవనాన్ని రిపేర్ చేయడానికి ఏర్పాటు చేసిన షట్టరింగ్.. అక్కడున్న వాహనాలపై పడడంతో అనేక కార్లు దెబ్బతిన్నాయి. ఇక ఢిల్లీలో శనివారం ఉదయం కూడా తేలిక పాటి వాన పడింది. దీంతో ఎండల ధాటికి అల్లాడిన ఢిల్లీవాసులకు ఎంతో ఊరట లభించింది.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కర్ణాటక, కేరళలలోనూ తేలికపాటి వానలు(Delhi Storm) కురిసే అవకాశం ఉందిన భారత వాతావరణ విభాగం తెలిపింది. దేశంలోని 7 రాష్ట్రాల్లో టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు శుక్రవారం 40 డిగ్రీలు దాటాయి.