LPG Price Hike : అక్టోబర్ 1న గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ వినిపించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 209 మేర పెంచాయి. ఈరోజు నుంచే ఈ పెంచిన ధర అమల్లోకి రానుంది. ఈ పెంపుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1522 నుంచి రూ. 1731కు, కోల్కతాలో రూ. 1636 నుంచి రూ. 1839కు, ముంబైలో రూ.1482 నుంచి రూ. 1684కు, చెన్నైలో రూ. 1898కు పెరిగింది. అయితే మనం ఇళ్లలో వాడే వంటగ్యాస్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపించినందుకు ఇప్పటికిప్పుడు కేంద్ర సర్కారు వంటగ్యాస్ ధరల పెంపు జోలికిపోదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మోడీ సర్కార్ గత నెలలోనే వంటగ్యాస్ ధరను రూ.200, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 157 మేర తగ్గించింది. అయితే ఇప్పుడు మళ్లీ రూ. 209 పెరగడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పాత రేంజ్ కే చేరినట్టు అయింది. దీంతో ఆ సిలిండర్లను వినియోగించే వ్యాపార సంస్థలకు ధరల తగ్గింపుతో లభించిన ఊరట నెల రోజుల వ్యవధిలోనే ఆవిరైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో ఎన్నో వాణిజ్య ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు (LPG Price Hike) ఉంటాయి. హోటల్ రంగంపైనా ఇది ప్రభావం చూపిస్తుంది.