హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో బాంబు కాల్ కలకలం రేపింది. కంపెనీ ఆవరణలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో కాసేపు భయాందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కంపెనీకి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కంపెనీ ఆవరణలో ఎలాంటి బాంబు లేదని..అది ఫేక్ కాల్గా పోలీసులు గుర్తించారు. కార్యాలయంలో విధ్వంసక నిరోధక బృందాలు తనిఖీలు చేస్తుండగా, ముందుజాగ్రత్త చర్యగా ఉద్యోగులు భవనం నుంచి బయటకు వెళ్లాలని కోరారు. కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. గతంలో కంపెనీ ఉద్యోగి ఈ ఫోన్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.