Site icon HashtagU Telugu

Dysuria: ఎండాకాలంలో మూత్రం మంట ఎందుకు వస్తుంది.. అప్పుడు ఏం చేయాలో తెలుసా?

Dysuria

Dysuria

వేసవికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందానికి సంబంధించిన సమస్యలతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వడదెబ్బ, డిహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలతో పాటుగా మూత్రం మంట ప్రాబ్లెమ్ కూడా వస్తూ ఉంటుంది. మూత్రంలో మంట ఎండాకాలంలోనే ఎక్కువగా వస్తుంటుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, మంట వస్తుంటుంది. అంతేకాకుండా రాత్రి మొత్తం మూత్ర విసర్జనకు లేస్తూ ఉండాలి. దీన్ని భరించడం చాలా కష్టం. అసలు మూత్రంలో మంట, చిరాకుకు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండాకాలంలో చాలా సార్లు మూత్ర విసర్జన చేసేటప్పుడు మండుతున్న అనుభూతి కలుగుతుంది. వైద్య భాషలో దీనిని డైసూరియా అంటారు. ఈ పరిస్థితి కొన్ని కొన్నిసార్లు మూత్ర మార్గంలో చికాకు కలిగిస్తుంది. ఈ సమస్య ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు వస్తూ ఉంటుంది. ఎండాకాలంలో మూత్రంలో మంట రావడానికి ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడం. అలాగే నిర్జలీకరణం కారణంగా మూత్రం తక్కువగా వస్తుందట. అలాగే దీని వల్ల మంట కలుగుతుందట. ఎండాకాలంలో మూత్రంలో చికాకు మూత్రాశయంలో బ్యాక్టీరియా సంఖ్య పెరగడం వల్ల వస్తుందట. దీన్నే యూటీఐ అని కూడా అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారికే వస్తుందట.

అదేవిధంగా ఎండాకాలంలో మూత్రంలో మంటరావడానికి స్పైసీ ఫుడ్ కూడా ఒక ప్రధాన కారణం అని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది ఎండాకాలంలో కూడా ఆయిల్, స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల మూత్రంలో మంట వస్తుందట. అందుకే ఈ సీజన్ లో స్పైసీ ఫుడ్ ను తినకూడదని చెబుతున్నారు..క్లామిడియా, గోనేరియా, హెర్పెస్ వంటి లైంగిక సంక్రమణ అంటువ్యాధులు కూడా మూత్రంలో చికాకు, మంట, నొప్పిని కలిగిస్తాయి. ఇది ప్రైవేట్ భాగం చుట్టూ దద్దుర్లు లేదా బొబ్బల లాగా కూడా కనిపిస్తుందట. మూత్ర పిండాల్లో రాయి ఉన్నవారికి కూడా ఈ సమస్య వస్తుందట. మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన సమయంలో మంట కలుగుతుందట. ఇలాంటి పరిస్థితిలో మీరు తప్పనిసరిగా హాస్పటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోవాలని చెబుతున్నారు. వేసవిలో మూత్రంలో మంట తగ్గాలంటే కీరదోసకాయ, పెరుగు, కొబ్బరినీళ్లు, అల్లం వంటివి మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి మిమ్మల్ని చల్లబరుస్తాయి. మూత్రంలో మంట రాకుండా చేస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ సమస్య అలాగే వేధిస్తూ ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.