మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. రక్తం (Blood) మన ఒంట్లోని అన్ని కణాలకు ఆక్సిజన్ను, పోషకాలను అందిస్తుంది. కణాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రొజువారీ వ్యవహారాల్లో భాగంగా దెబ్బతినే కణజాలాను రక్తమే రిపేర్ చేస్తుంది. అనారోగ్యకరమైన లైఫ్స్టైల్, ఆహారంలో ఉండే వ్యర్థ పదార్థాల కారణంగా రక్తంలో మలినాలు చేరతాయి. రక్తం (Blood) లో వ్యర్థాలు ఎక్కువైతే.. అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, అలర్జీలు, దురదలు వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి రక్తశుద్ధి తప్పనిసరి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి.. రక్తంలో వ్యర్థాలు లేకుండా ఉండటం చాలా అవసరం. రక్తాన్ని శుద్ధి చేసే కొన్ని మూలికల గురించి ఆయుర్వేద డాక్టర్ జికె తారా జయశ్రీ MD (Ayu) మనకు వివరించారు.
వేప:
రక్తంలోని మలినాలు తొలగించడానికి వేప అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వేప లివర్ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. చర్మ వ్యాధులు, అల్సర్లు, కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాలకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. రోజూ రెండు వేపాకులు నమలితే.. రక్తం డిటాక్స్ అవుతుంది. గురువెచ్చని నీళ్లలో వేప పొడి వేసుకుని తాగినా మంచిదే.
మంజిష్ఠ:
ఇది వేపలా చేదుగా ఉండే ఆస్ట్రింజెంట్ హెర్బ్. మంజిష్ఠ శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగేలా సహాయపడుతుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది రక్తంలోని అడ్డంకులను కరిగిస్తుంది. మంజిష్ఠ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్కు మేలు చేస్తుంది. మంజిష్ఠ లోకల్ ఆయుర్వేద స్టోర్లో మీకు సులభంగా లభిస్తుంది. మంజిష్ఠ రసాన్ని 10-30 మిల్లీలీటర్లు తీసుకుని.. దానికి సమాన పరిమాణ నీటిలో కలిపి తీసుకోండి. ఇది రోజుకు రెండు సార్లు తాగండి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వైద్యుని సలహాతో తీసుకుంటే మంచిది.
తిప్పతీగ:
తిప్పతీగ మూడు దోషాలను సమతుల్యం చేసే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇది రక్తం శుద్ధి చేయడంలోనూ.. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తిప్పతీగ రక్తం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. హైపోగ్లైసీమిక్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇది ప్యాంక్రియనా నుంచి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. తిప్పతీగ పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచిది.
ఉసిరి:
ఉసిరి.. బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఉసిరి హానికరమైన టాక్సిన్స్ను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉసిరి రసాన్ని తరచు తీసుకుంటే.. హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఉసిరి టీ, ఉసిరి చట్నీ, ఉసిరి మురబ్బా ఇలా మీ డైట్లో యాడ్ చేసుకోండి.
తులసి:
తులసిలోని ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులు తింటే.. రక్తం క్లీన్ అవుతుంది. తులసి ఆకులలో ఆక్సిజన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. దీనితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.
పసుపు:
పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయ. ఇది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలోని అనేక సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఈ పాలు రక్తాన్ని క్లీన్ చేస్తాయి.
Also Read: Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..