ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. అధిక రక్తపోటు , హైపర్టెన్షన్ జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. రక్త నాళాల ద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు.అయితే సాధారణంగా చాలా మంది ఇతర వ్యాధులను పట్టించుకున్నంత ఎక్కువగా అధిక రక్తపోటు సమస్యను పట్టించుకోరు. అధిక రక్తపోటు చిన్న సమస్య అయినప్పటికీ,ప్రాణాంతకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధిక రక్తపోటును గనుక కంట్రోల్ చేయకపోతే అటువంటి వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హైబీపి వ్యాధి సమస్యతో బాధపడుతున్నారు. అన్ని రకాల వయసుల వారు రక్తపోటు సమస్యలతో పోరాడుతున్నారు. రక్తపోటు అధికంగా ఉన్నవారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాగా అరటిపండు తినడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అరటిపండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది తీసుకుంటే అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది. అరటిపండు రోజుకు ఒకటి లేదా రెండు తినడం వలన అధిక రక్తపోటు, గుండె జబ్బులు, సడన్ స్ట్రోక్స్ నుంచి రక్షిస్తుంది. మన శరీరంలోని అదనపు సోడియం రక్తనాళాలపై ఒత్తిడిని తెస్తాయి.
అయితే అటువంటి సమయంలో పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది. దానికి తోడు శరీరంలోని అదనపు సోడియం యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది. పొటాషియం అనేది శరీరంలోని ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటు నియంత్రణకు సహకరిస్తుంది. అరటిపండుతో పాటు బచ్చలికూర, ఆకుకూరలు, ఓట్స్, పుచ్చకాయ, అవకాడో, దుంపలు, నారింజ, పొద్దుతిరుగుడు విత్తనాలు, క్యారెట్లు సరైన మోతాదులో తీసుకుంటే హైబీపీని తగ్గించవచ్చు.