Brain Chip : పక్షవాతం, నరాల సంబంధిత తీవ్ర వ్యాధులు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. ఈ తరహా వ్యాధుల బారినపడే వాళ్లకు చికిత్స చేయడం పెద్ద సవాల్గా మారుతోంది. చికిత్స చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. అందుకే ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ కంపెనీ మనిషి మెదడులో అమర్చేందుకు అనువైన ఎలక్ట్రానిక్ చిప్ను తయారు చేసింది. ఆ చిప్ను(Brain Chip) కొంతమంది పక్షవాతం రోగుల్లో అమర్చి.. ఎలాంటి ఫలితాలు వస్తాయి ? అనే దానిపై ప్రయోగాలు చేస్తోంది. వీటికి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. దాని గురించి తెలుసుకుందాం..
— Neuralink (@neuralink) March 20, 2024
We’re now on WhatsApp. Click to Join
న్యూరాలింక్ కంపెనీ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చిన వ్యక్తి పేరు నోలాండ్ అర్బాగ్. అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ చిప్ను అమర్చాక నోలాండ్ అర్బాగ్ వీడియో గేమ్ సివిలైజేషన్-జుఖి, చెస్ ఆడాడు. ఈ గేమ్స్ ఆడే టైంలో అతడు చాలా యాక్టివ్గా కనిపించాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ‘ఎక్స్’లో న్యూరాలింక్ కంపెనీ లైవ్ స్ట్రీమ్ చేసింది. మెదడులో చిప్ అమర్చడం వల్ల అతడు ఎవరి సాయం అక్కర లేకుండానే వీడియో గేమ్ ఆడాడని న్యూరాలింక్ కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూరాలింక్ సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎనిమిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో అర్బాగ్ వెన్నెముక దెబ్బతింది. దీంతో మెడ కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. కాళ్లు, చేతులు కదల్చలేని పరిస్థితి వచ్చింది. న్యూరాలింక్ కంపెనీ లైవ్ స్ట్రీమ్ సమయంలో అర్బాగ్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ సాంకేతికతను మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. జీవితంలోనేను గేమ్స్ ఆడతానని ఊహించలేదు. న్యూరాలింక్ చిప్ వల్లే అది సాధ్యమైంది. నా జీవితంలో ఇప్పటికే చాలా సానుకూల మార్పులు వచ్చాయి. గంటల కొద్దీ వీడియో గేమ్స్ ఆడగలుగుతున్నాను’’ అని చెప్పాడు.