మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ రావడం అనేది సహజం. ఈ పీరియడ్స్ సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కడుపునొప్పి తో పాటు నీరసంగా అనిపించడం, అలాగే శరీరంలో రకరకాల మార్పుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. మరి ముఖ్యంగా ఎక్కువ మందిని వేధించే సమస్య కడుపునొప్పి. ఈ నొప్పితో విలవిల్లాడుతుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, చాలా మంది తెలిసి తెలియక పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కానీ పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల పదార్థాలు తినకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెలసరి సమయంలో మసాలా ఫుడ్స్ కు దూరంగా ఉండాలట. ఎందుకంటే నెలసరి సమయంలో వీటిని తింటే కడుపులో మంట కలుగుతుంది. ఇక ఈ సమయంలో స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణిస్తుందట. ఇది అల్సర్లకు దారితీస్తుందని, కడుపు నొప్పి కూడా పెరగవచ్చని చెబుతున్నారు. అందుకే స్పైసీ ఫుడ్ ను తినకూడదని చెబుతున్నారు. అలాగే చాలామంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినాలనే కోరికలు కలుగుతాయి. అయితే మీరు ఈ సమయంలో డార్క్ చాక్లెట్ తినడం మంచిది. ఎందుకంటే ఇది పీరియడ్స్ ను సులభతరం చేస్తుంది, అలాగే నొప్పిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ పీరియడ్స్ తిమ్మిరిని దూరం చేస్తుందట. కాబట్టి మిల్క్ చాక్లెట్ కు బదులు డార్క్ చాక్లెట్ తినడం మంచిదని చెబుతున్నారు.
చాలా మందికి ఫ్యాట్ ఫుడ్ బాగా నచ్చుతుంది. కానీ పీరియడ్స్ సమయంలో ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారాలను అసలే తినకూడదు. ఇది కూడా పీరియడ్స్ సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే పిజ్జాలు, బర్గర్లు వంటివి కూడా తినకూడదని చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో మాంసాహారం తినాలి అనుకుంటే గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తినాలట. రెడ్ మీట్ కి దూరంగా ఉండాలట. అలాగే శనగపిండి, వైట్ రైస్, బీన్స్, ఆల్కహాల్ వంటి పదార్థాలకు కూడా స్త్రీలు నెలసరి సమయంలో దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
