. శరీరానికి ఐరన్ ఎందుకు అవసరం?
. ఐరన్ లోపంకి ఎండుద్రాక్ష, ఖర్జూరాలు సరిపోతాయా?
. ఐరన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందా?
Raisins And Dates : మన శరీరం ఆరోగ్యంగా పనిచేయాలంటే అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఐరన్ ఒకటి. రక్తంలో ఎర్ర రక్తకణాల తయారీ నుంచి శరీరమంతా ఆక్సిజన్ సరఫరా వరకు ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్ కోసం చాలామంది ఎండుద్రాక్ష, ఖర్జూరాలపైనే ఆధారపడుతున్నారు. కానీ నిజంగా అవే సరిపోతాయా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఐరన్ మన శరీరంలో రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీరంలోని ప్రతి కణానికి చేరవేయడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడం, మెదడు అభివృద్ధి, శారీరక శక్తిని పెంపొందించడంలో కూడా ఐరన్ అవసరం.
శరీరంలో ఐరన్ లోపిస్తే నీరసం, అలసట, తలనిర్ఘాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి ఎండుద్రాక్ష, ఖర్జూరాలు తింటే ఐరన్ స్థాయిలు వెంటనే పెరుగుతాయనే భావన ఉంది. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం వీటిపైనే పూర్తిగా ఆధారపడటం సరైనది కాదు. 100 గ్రాముల ఖర్జూరాల్లో కేవలం 0.89 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది. అదే 100 గ్రాముల ఎండుద్రాక్షలో సుమారు 4.26 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. కానీ ఒక మహిళకు రోజుకు సగటున 29 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. అంటే ఈ రెండూ మాత్రమే రోజువారీ అవసరాలను పూర్తిగా తీర్చలేవు. అదే సమయంలో ఇవి ఎక్కువ క్యాలరీలు, చక్కెర కలిగి ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిపుణులు సూచించేది ఏమిటంటే… ఐరన్ కోసం ఒకే ఆహారంపై ఆధారపడకుండా విభిన్న ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే రాజ్మా, నువ్వులు, బఠాణీ, సోయాబీన్స్, అమరాంత్ గింజలు కూడా మంచి ఐరన్ వనరులు. అంతేకాదు గుడ్లు, మాంసం, చేపలు, రొయ్యలు వంటి ఆహారాల ద్వారా కూడా శరీరానికి అవసరమైన ఐరన్ను పొందవచ్చు. ఐరన్ శోషణ మెరుగుపడాలంటే విటమిన్ C ఉన్న నిమ్మకాయ, నారింజ వంటి పండ్లను కూడా ఆహారంలో చేర్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎండుద్రాక్ష, ఖర్జూరాలతో పాటు ఐరన్ పుష్కలంగా ఉన్న ఇతర ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి సరైన ఆహారమే సరైన పరిష్కారమని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
