కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాంచిన సంగతి తెలిసిందే. పలు వేరియంట్లుగా పుట్టుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. చిన్న పిల్లల నుంచి పండు ముసలొల్ల వరకు కోవిడ్ బారిన పడ్డారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత…తగ్గిన తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలు కొందర్నీ ఇప్పటికీ వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నట్లు అమెరికాలో శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
కోవిడ్ బారినపడిన పిల్లలు…కోవిడ్ సోకని పిల్లలపై పరిశోధన జరిపారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన పిల్లల్లో మొదటి ఆరునెలల్లో ఆస్తమా లక్షణాలు బయటపడ్డాయి. ఆసుపత్రుల్లో చేరడం, అత్యవసర ఇన్ హేలర్ వాడటం, స్టెరాయిడ్స్ చికిత్సలందించడం వంటివి గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ ప్రీ ప్రింట్ లో పరిశోధకులు పేర్కొన్నారు.
కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలోని చిల్ట్రన్ హాస్పిటల్ వైద్యులు మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కోవిడ్ బారిన పడిన 2 నుంచి 17 సంవత్సరాల వయస్సున్న 61,916 మంది పిల్లలపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో సార్స్ కోవి2 కోసం పరీక్షలు నిర్వహించిన వారికి ఆస్తమా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే కోవిడ్ -19తో ఇన్ఫెక్షన్ సోకిన పిల్లలు మొదటి ఆరునెలల్లో అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. మిగతా పిల్లలతో పోలిస్తే ఆస్తమా ఉన్న పిల్లలకు ఇమ్యూనిటీ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఆస్తమా నుంచి పిల్లలు త్వరగానే కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
Cover Pic Courtesy- UNICEF