Children: రాష్ట్రంలో సుమారు 54 శాతం ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పలు సర్వేలో వెల్లడయింది. ఇందులో 30% వరకు 15 ఏళ్ల వయసు వారేనని వెలుగులోనికి వచ్చింది. సమాజంలో పెరుగుతున్న చదువు ఒత్తిడి, వెలుతురుకు దూరమవడం, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కంటి చూపు దెబ్బ తినేందుకు కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో వీడియో గేమ్స్, రైమ్స్, కార్టూన్ ఛానల్ లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనితో మానసిక రుగ్మతలతో పాటు కళ్ళకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
స్కూళ్లకు వెళ్లాల్సిన సమయంలో దవాఖానాల చుట్టూ తిరిగే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. పాఠశాలల పిల్లలల్లో హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి క్రమేపి పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడిస్తున్నారు. ఎక్కువగా చిన్నారుల్లో దూరపు చూపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంకా దుమ్ము ధూళి వల్ల కళ్ళల్లో అలర్జీ పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
కళ్ళకు అవసరమైనంత సహజ వెలుతురులో ఉండడం ఎంతో అవసరం. కానీ, ఇటీవల కాలంలో పెరుగుతున్న సౌకర్యాలతో పొద్దంతా కూడా కరెంటు వెలుగుల్లోనే గడపాల్సి వస్తుంది. ఒక్కోసారి మసక వెలుతుర్లోను ఉండాల్సి వస్తున్నది. ఇలాంటి కారణాలవల్ల కళ్ళపై భారం పడుతున్నది. ఎక్కువ శాతం కృత్రిమ వెలుతురులో ఉండి ఒకసారి సహజ వెలుతుల్లోకి రావడం వల్ల కూడా కొంతవరకు ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల కూడా చిన్నారులు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.