Fact Checked By factly
ప్రచారం : అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ వంటి పలువురు సెలబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్న దృశ్యాలు.
వాస్తవం : ఈ పోస్టులో పేర్కొన్న సినీ నటులు ఎవ్వరూ 2025 మహా కుంభమేళాలో పాల్గొనలేదు. వైరల్ అవుతున్న ఫోటోలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ద్వారా తయారు చేసినవే. కాబట్టి జరుగుతున్న ప్రచారం తప్పు.
‘‘అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, రణవీర్ సింగ్, తమన్నా భాటియా, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు’’ అని చెప్తూ.. వారు కాషాయ దుస్తులు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అసలు ఈ ఫొటోల వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్లో మనం తెలుసుకుందాం..
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ను మీరు ఇక్కడ చూడొచ్చు.
మేం గుర్తించిన అంశాలివీ..
ఈ వైరల్ క్లెయిమ్(Fact Check) వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి.. మేం తగిన కీ వర్డ్స్ను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాం. వైరల్ ఫోటోలలో కనిపిస్తున్న సెలబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్నట్లుగా మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
వైరల్ అవుతున్న ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికాం. ఈ ఫోటోలతో కూడిన విశ్వసనీయ వార్తా కథనాలు మాకు లభించలేదు.
ఫోటోలలో ఉన్న సెలబ్రిటీల సోషల్ మీడియా ప్రొఫైళ్లలో మేం వెతికాం. అక్కడ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కూడా మాకు ఈ ఫోటోలు లభించలేదు.
ఈ ఫోటోలను గమనిస్తే.. రాజపాల్ యాదవ్, పంకజ్ త్రిపాఠి ఉన్న ఫొటోలో.. రాజ్పాల్ యాదవ్ వేలు టీ కప్పులో ఉన్నట్టుగా మాకు కనిపించింది. ఇలాంటి తప్పులు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఉపయోగించి తయారు చేసిన ఫొటోలలో దొర్లుతుంటాయి.
ఈ ఫోటోలు కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ద్వారా తయారు చేసినవే.
హైవ్, సైట్ ఇంజన్ టూల్స్తో వెరిఫికేషన్
పైఫొటోలన్నీ ఏఐతో తయారు చేసినవే అనే విషయాన్ని మేం వేరిఫై చేసుకున్నాం. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కంటెంట్ డిటెక్షన్ టూల్స్ అయిన హైవ్ , సైట్ ఇంజన్లను వినియోగించాం. ఈ టూల్స్తో చేసిన ఎనాలిసిస్ ప్రకారం.. వైరల్ అవుతున్న ఫోటోలన్నీ ఏఐతో తయారు చేసినవే.
(ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు).
ఏబీపీ లైవ్ టీవీలో..
వైరల్ ఫోటోలలో ఏబీపీ లైవ్ అని ఒక లోగో ఉండటం మేం గమనించాం.తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఫొటోలన్నీ ఏబీపీ న్యూస్ వారు తయారు చేశారని తేలింది. 2025 మహా కుంభమేళాలో ఒకవేళ సెలబ్రిటీలు పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహించి, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్(ఏఐ) టెక్నాలజీతో ఈ ఫొటోలను వారు తయారు చేశారు. ఈమేరకు ఏబీపీ లైవ్ టీవీ వారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ (ఆర్కైవ్ లింక్)చేశారు.
వైరల్ ఫోటోల గురించి మేం ఇంటర్నెట్లో వెతుకుతున్న సమయంలో.. నటుడు రాజ్పాల్ యాదవ్ 2024 డిసెంబరులో, 2025 జనవరి మొదట్లో ప్రయాగ్రాజ్ వెళ్లినట్లు కొన్ని వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. కానీ, అవన్నీ 2025 జనవరి 13న మహా కుంభమేళా మొదలవక ముందటివి(పాతవి) అని మేం గుర్తించాం.