Site icon HashtagU Telugu

Navaratri: నవరాత్రుల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినరు..? పురాణాలు చెప్పే సమాధానం ఇదీ!!

Durga Godesses

Durga Godesses

నవరాత్రుల సమయంలో కొంతమంది తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. ఇంకొందరు మొదటి రోజున, అష్టమి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం పాటించని వారు కూడా నవరాత్రి నియమాలన్నింటినీ పాటిస్తారు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తొమ్మిది రోజులు తినడం మానేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు? అనే దానికి గల కారణాలు చాలామందికి తెలియవు. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం..

తామసిక, రాజసిక ఆహారాలు..

మత విశ్వాసం ప్రకారం.. ఉల్లిపాయ, వెల్లుల్లిని తామసిక, రాజసిక ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి మన మనస్సును, శరీరాన్ని కలుషితం చేసేవని భావిస్తారు.ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం వల్ల ఇంద్రియ శక్తి మేల్కొలుపు ప్రారంభమవుతుంది. మనస్సు ఆనందం, విలాసాల వైపు పరుగులు తీస్తుంది. ఉపవాసం సమయంలో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. తొమ్మిది రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదని చెప్పటానికి కారణం ఇదే.అందుకే నవరాత్రి 9 రోజులలో తామసిక ఆహారాల జోలికి పోవద్దని పెద్దలు చెబుతారు.

పురాణాల ప్రకారం..

పురాణాల ప్రకారం.. విష్ణువు మహాసముద్రాన్ని మథిస్తున్న సమయంలో దేవతలకు అమృతం దక్కుతుంది. అప్పుడు స్వరభాను అనే రాక్షసుడు దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని, తేనెను సేవించాడు. విష్ణువుకు ఈ విషయం తెలిసి అతని మొండెం, తలను వేరు చేశాడు. అప్పటి నుంచి స్వరభానుని తలను రాహు అని, మొండెంను కేతు అని పిలుస్తున్నారు. అయితే ఆ రాక్షసుడి మొండెం నుంచి తలను వేరు చేసినప్పుడు రెండు చుక్కల తేనె భూమిపై పడింది. దాని నుండి ఉల్లిపాయ, వెల్లుల్లి తయారయ్యాయట. అమృతం నుండి ఉద్భవించినందున ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివని భావిస్తారు. కానీ అవి రాక్షసుల వల్ల వచ్చాయి కాబట్టి పూజా సమయంలో వాటిని దూరం పెడతారు. నవరాత్రుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిని ఈ కారణం వల్లే వినియోగించరు.