Panakam And Vadapappu శ్రీరామనవమి పండుగ రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు సమర్పించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా శ్రీరామనవమి పండుగ వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడి పూజ తర్వాత కొత్తకుండలో మిరియాలు, యాలకులు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెడతారు. అయితే భగవంతుడికి నివేదించే ఈ ప్రసాదాలు కాలానుగుణంగా, ఆరోగ్యానికి అనుకూలంగా నిర్ణయించినవే.
శ్రీరామనవమి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆధ్యాత్మిక వాతావరణం, పానకం, వడపప్పు చల్లదనం. వసంత రుతువు పలకరింపుతో భానుడి ప్రతాపం మొదలయ్యే వేళ శ్రీరామనవమి పండుగ వస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు మన శరీరంలో వచ్చే మార్పులను కూడా ఆహ్వానించే పండుగ శ్రీరామనవమి (Ram Navami 2026). ఈ పండుగ కేవలం పూజకో, గుడికో పరిమితం కాకుండా మన లైఫ్స్టైల్లో ఒక భాగమైపోయింది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పండుగ వేళ అందరూ ఎంతో ఇష్టంగా స్వీకరించే పానకం, వడపప్పు ఎలా తయారు చేస్తారు? వడపప్పు, పానకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.
పానకం తయారీకి అవసరమైన పదార్థాలు
- బెల్లం – అర కప్పు
- నీళ్లు – 2 కప్పులు
- మిరియాల పొడి – పావు స్పూన్
- శొంఠి పొడి – పావు స్పూన్
- యాలకుల పొడి – పావు స్పూన్
- ఉప్పు – చిటికెడు
- నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు
- పచ్చ కర్పూరం – చిటికెడు
- తులసి ఆకులు – 5 లేదా
పానకం తయారు చేసే విధానం
- మొదట గిన్నెలో కావలసినంత నీటిని తీసుకొని అందులో బెల్లం తురుము వేసి నానబెట్టాలి.
- బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఈ నీటి మిశ్రమంలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత సరిపడినంత ఉప్పు, పచ్చ కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పానకంలో తులసి ఆకులు, కావాలంటే కొంచెం ఐస్ వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతే చాలా సింపుల్, తియ్యతియ్యటి బెల్లం పానకం రెడీ!
పానకం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
- పానకంలో వేసే బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి పొడిలో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే వేసవి సమయంలో వచ్చే శ్రీరామనవమి పర్వదినం రోజు పానకం తీసుకుంటే వేసవి తాపం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- అలాగే పానకంలో వేసే బెల్లంలో ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉన్నందున తక్షణ శక్తి లభిస్తుందని International Journal of Scientific Research in Chemistry అధ్యయనం పేర్కొంది. అంతే కాకుండా రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడం, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి పనులు చేస్తుంది. ముఖ్యంగా బెల్లం వల్ల ఎసిడిటీ, జీర్ణసమస్యలు సైతం దూరమవుతాయట.
- ఇక ఎండలకు పిల్లలు త్వరగా అలసిపోయి నీరసపడుతుంటారు. పానకం తాగడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి.
- అంతేకాకుండా పానకంలో వేసే మిరియాలు, తులసి ఆకులు దగ్గు, కఫం తగ్గించే ఔషధ గుణాలను కలిగి ఉంటాయని Journal of Ayurveda and Integrative Medicine అధ్యయనం తెలియజేస్తోంది.
- ముఖ్యంగా శొంఠిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మందాన్ని తగ్గించి ఆకలిని పెంచుతాయి. అంతే కాకుండా శొంఠి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వడపప్పు తయారీకి కావలసిన పదార్థాలు
- పెసరపప్పు – ఒక కప్పు
- తురిమిన కొబ్బరి – మూడు చెంచాలు
- పచ్చిమిర్చి – 2 లేదా 3 చిన్న చిన్న ముక్కలు
- నిమ్మరసం – ఒక స్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
వడపప్పు తయారీ విధానం
- మొదట ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని పెసరపప్పును 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- తర్వాత నీటిని వడకట్టుకుని పెసర పప్పును పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత పెసర పప్పులో తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- కొంతమంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు. అంతే.. టేస్టీ టేస్టీ వడపప్పు రెడీ!
వడపప్పు ఆరోగ్య ప్రయోజనాలు
- శ్రీరామనవమి రోజు స్వీకరించే పెసరపప్పులో ఏ, బీ, సీ, ఈ విటమిన్తో పాటు ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని National Institutes of Health అధ్యయనం పేర్కొంటోంది. ఇవి శరీర పనితీరును మెరుగుపరుస్తాయి.
- అంతే కాకుండా పెసరపప్పులో బాగా అధికంగా ఉండే ప్రొటీన్లు, ఫైబర్ వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహకరిస్తాయి.
- ముఖ్యంగా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి పెసరపప్పు తోడ్పడుతుంది.
- అదేవిధంగా పెసర పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు, పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శ్రీరామచంద్రమూర్తి వసంత కాలంలో జన్మించాడు. చైత్ర మాసపు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో శరీరం చల్లగా ఉండటానికి, సేదతీరడానికి ప్రకృతి ఇచ్చిన వరాలే ఈ వడపప్పు, పానకం. పానకంలోని తీపి సంతోషానికి, మిరియాల ఘాటు కష్టానికి, యాలకల సువాసన సద్గుణానికి సంకేతం. జీవితం అంటే అన్నీ రుచుల సమ్మేళనమని అన్నింటినీ సమానంగా స్వీకరించాలని రామతత్వం మనకు బోధిస్తుంది.
