Bezawada Kanaka Durgamma Charitra : విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గా మాతే. కృష్ణా నది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచారు. దుర్గా (Kanaka Durga) మాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షాసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది. కలకత్తా-చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేల్లో అతి పెద్ద జంక్షన్ కూడా బెజవాడనే. భారతీయ రైల్వే పెద్ద జంక్షన్లలో బెజవాడ ఒకటి. దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు. దుర్గా మాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున క్రిష్ణా నదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ (Kanaka Durgamma) ఆలయాన్ని ఎవరు నిర్మించారు.. ఎప్పుడు కట్టారు.. అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకీలాద్రి (Indrakeeladri) అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం, విజయవాడ కనక దుర్గమ్మ (Kanaka Durgamma) ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్ర కీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు. తను కూడా తన తండ్రిలాగా నీతి, నీజాయితీ, ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకిగుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజ భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు. మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు.
ఆ సమయంలో బాలుడు రథ చక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కానీ.. ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని, తనకు న్యాయం చేయాలని రోధించింది. అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు. వారంతా చాలాసేపు చర్చించి ‘మరణ శిక్ష విధించాలి అని చెబుతారు. అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు. తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి శిక్షను తగ్గించొచ్చు’ అని చెబుతారు. అయితే రాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు. ‘న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి’ అంటూ మరణ శిక్ష విధిస్తాడు.
అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు. అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని, ఇటు రాకుమారుడు ఇద్దరినీ బతికించడమే కాదు.. అక్కడ కనక వర్షం కురిపించింది. అప్పటినుంచి ఆ దేవి కనక దుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది.(ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి)
మరో కథనం ప్రకారం.. కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి కీలుడు పర్వతరూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురుచూశాడు. కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది. ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గా మాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరొచ్చింది. అమ్మవారు ఇక్కడ కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది.
ఇంకో కథనం ప్రకారం, ఈశ్వరుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడు. అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవ్వటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.