Narmada Pushkaralu 2024 : మనదేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. ఈ నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. మే 1న వృషభరాశిలోకి బృహస్పతి ప్రవేశించడంతో నర్మదా నదికి పుష్కరాలు(Narmada Pushkaralu 2024) ప్రారంభం కానున్నాయి. నర్మదానదికి మరో పేరు రేవా నది. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో ఉన్న నర్మదా నదీ తీరంలో అనేక ఘాట్లను నిర్మించారు. ఈ నదీ ప్రవాహం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. నీరు కూడా స్వచ్చంగా ఉంటుంది. ఘాట్ల వద్ద నది లోతు ఎక్కువగా ఉండదు. దీనివల్ల భక్తులు సులభంగా స్నానాలు చేయొచ్చు. అన్ని ఘాట్లలోనూ ఓంకారేశ్వర్ ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటితీర్థ ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడ స్నానం చేస్తే అనేక తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడున్న ఇతర ముఖ్యమైన ఘాట్లలో చక్రతీర్థ ఘాట్, గోముఖ ఘాట్, భైరోన్ ఘాట్, కేవల్ రాం ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంగం ఘాట్, అభయ్ ఘాట్ ఉన్నాయి. నీరు నారాయణ స్వరూపం కనుక ఆ స్పర్శచే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. తీర్ధ స్నానం ఉత్తమం, దానికంటే నదీస్నానం శ్రేష్టమని పెద్దలు చెబుతారు. పుష్కర సమయంలో నదీస్నానం ఉత్తమోత్తమం. బాణలింగాలుగా పిలువబడే గులకరాళ్ళు ఈ నదిలో లభిస్తాయి. శివుడు గులక రాళ్ళలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
మనుషులు పాపాలను పోగొట్టుకోడానికి నదుల్లో స్నానం చేస్తుంటారు. ఆ పాపాలన్నీ కలిసి నదులు అపవిత్రం అవుతున్నాయి. నదులు అపవిత్రం అవుతుంటే చూడలేని పుష్కరుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. తనను పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరుతాడు. దేవ గురువైన బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని పుష్కరుడికి బ్రహ్మదేవుడు సూచిస్తాడు. పుష్కరుడు నదిలో చేరగానే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి సప్త మహా ఋషులు ఆ నదికి చేరుకుంటారని చెబుతారు. ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని నమ్ముతారు.