మాములుగా మనం పండుగ సమయంలో, ఏదైనా పూజలు వ్రతాలు నోములు చేసినప్పుడు ఉపవాసం ఉండడం అన్నది కామన్. అయితే ఉపవాసం సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయం చాలా మందికి తెలియదు. దాంతో చాలామంది ఉపవాసం సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండే వారు కచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు ఉపవాస తీర్మానాన్ని తీసుకోవడం ద్వారా ఉపవాసాన్ని ప్రారంభించాలి. చాలా సందర్భాలలో, బ్రహ్మ ముహుర్తంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్మానం తీసుకోవాలి.
ఉపవాస తీర్మానంలో, ఉపవాస సమయ వ్యవధిని కూడా నిర్ణయించాలి. తీర్మానం లేకుండా చేసిన ఉపవాస ఫలితం అసంపూర్ణంగా ఉంటుంది. కాగా ఉపవాసాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిర్జలోపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం. ఈ నాలుగు రకాల ఉపవాసాలు మన శరీరాన్ని శుద్ధి చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి మీ శరీరాన్ని బట్టి మీకు ఏది వీలవుతుందో అలాంటి ఉపవాసం మాత్రమే చేయాలి. జలోపవాసం అంటే ఉపవాసం ఉండే వారు అప్పుడప్పుడు నీరు తాగవచ్చు. అయితే ఈ ఉపవాసంలో ఉండే వారు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా ఉండాలి. కనీసం 5 లీటర్ల వరకు తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపన ఒక లీటర్ నీటిని తీసుకొని, అనంతరం ప్రతి రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీటిని తాగాలి. రసోపవాసం అంటే పండ్లను తీసుకోవచ్చు. ఆరెంజ్, బత్తాయి, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవచ్చు.
ఫలోపవాసం అంటే ఫలాలు తీసుకోవచ్చు. కానీ నీళ్లు తాగరాదు. ఉపవాసంలో ఉండే ఫ్రిజ్ లోని నీళ్లను అస్సలు తీసుకోకూడదు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. సహజమైన నీళ్లనే తాగాలి. అలాగే సహజ పండ్ల రసాలను తీసుకోవాలి. కొన్ని పండ్లను అప్పుడప్పుడు తినవచ్చు. అయితే ప్రతి ఉపవాస నియమాల నుండి పిల్లలకు, గర్భిణులకు, వయోజనులకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది. అయితే పూజకు ముందు ఉపవాసం ఉండే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ఆ తర్వాత మీ ఆచారాలను బట్టి పూజను ప్రారంభించాలి. అనంతరం భగవంతుడిని స్మరించుకోవాలి. ఉపవాసం ఉండే వారు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగులోని దుస్తులను ధరించవద్దు. వీలైతే పసుపు, తెల్లని, పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరించాలి.