Vontimitta Temple: ఆంధ్రా అయోధ్యగా ‘ఒంటిమిట్ట రామాలయం’

ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం.

  • Written By:
  • Updated On - May 30, 2023 / 11:26 AM IST

రామాలయం లేని ఊరూ రామాయణం వినని వారూ ఉండరంటారు. దేశంలో ఏ రామాలయానికి వెళ్లినా రాముడి కుడివైపున లక్ష్మణుడు, ఎడమ వైపున సీతాదేవి, పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట రామాలయం. ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఆంధ్రా అయోధ్యగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లాలో ఉంది. ఆంధ్రా అయోధ్యగా అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయం బయట హనుమంతుడి గుడి విడిగా ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏటా జరిగే సీతారామ కల్యాణాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు.

స్థలపురాణం
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఒంటిమిట్ట కీకారణ్యంలా ఉండేదట. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ… అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట. రాజు ఈ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు. దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. అలాగే ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటుచేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు.  రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా… ఆంధ్రా వాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.

విశేష పూజలు
మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశినాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు.