Temples : జీవితంలో ఒక్కసారి ఈ 10 టెంపుల్స్‌ దర్శిస్తే చాలు!

చాలా మంది కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలతో, ఆశలతో, ఆకాంక్షలతో ముందుకెళ్లాలని భావిస్తారు. మరికొంత మంది నూతన సంవత్సరంలో దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావిస్తారు. అలాంటి వారి కోసం నూతన సంవత్సరం 2026 వేళ భారతదేశంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు (Famous Temples in India) ఏంటో.. వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. భారతదేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిని కొన్నింటిని అదృష్ట దేవాలయాలు (Lucky […]

Published By: HashtagU Telugu Desk
Famous Temples In India

Famous Temples In India

చాలా మంది కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయాలతో, ఆశలతో, ఆకాంక్షలతో ముందుకెళ్లాలని భావిస్తారు. మరికొంత మంది నూతన సంవత్సరంలో దేశంలోని కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించాలని భావిస్తారు. అలాంటి వారి కోసం నూతన సంవత్సరం 2026 వేళ భారతదేశంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు (Famous Temples in India) ఏంటో.. వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

భారతదేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిని కొన్నింటిని అదృష్ట దేవాలయాలు (Lucky Temples)గా భావిస్తారు. ఈ దేవాలయాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. వాటిలో ప్రముఖంగా మహాలక్ష్మీ ఆలయం (Mahalakshmi Temple Mumbai), లక్ష్మీ నారాయణ టెంపుల్‌ (Lakshminarayan Temple Vellore), నిమిషాంబ టెంపుల్‌ (Nimishamba Temple Srirangapatna), వైష్ణో దేవి ఆలయం (Vaishno Devi Temple Jammu), స్వర్ణ దేవాలయం (Golden Temple Amritsar), మహాకాళేశ్వర జ్యోతిర్లింగం (Shree Maha kaleshwar Temple Ujjain), శ్రీవెంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Temple), సిద్ధి వినాయక ఆలయం (Siddhivinayak Temple Mumbai), కాశీ విశ్వనాథ్‌ (Kashi Vishwanath Temple Varanasi), సూర్య దేవాలయం (Sun Temple Konarak) ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు దర్శించుకోకపోతే కొత్త ఏడాది 2026 (New Year 2026)లో అయినా దర్శించుకోండి..!

మహాలక్ష్మీ ఆలయం – ముంబై

ముంబైలోని మహాలక్ష్మీ ఆలయం సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అమ్మవారి పురాతన సుప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది 1831వ సంవత్సరంలో నిర్మించనబడిని అతి పురాతన దేవాలయం. ముంబై నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇదొకటి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి సమయాల్లో ఈ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు సిరిసంపదలు, శ్రేయస్సు, బుద్ధి కుశలత, జ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం.

లక్ష్మీ నారాయణ టెంపుల్ – వెల్లూర్ (శ్రీపురం)

వెల్లూర్‌ సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన బంగారు ఆలయం. దీనిని శ్రీనారాయణి పీఠం నిర్మించింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం. దీనిని లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీ యంత్రం ఆకారంలో ఉంటుంది. ఏడు ద్వారాలు కలిగి ఉండి వేల కిలోల (సుమారు 15 వేల) బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు, గొప్ప శిల్ప కళకు నిదర్శనం. వెల్లూరు నుంచి సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పక చూడాల్సిన దేవాలయాల్లో ఇదీ ఒకటి.

నిమిషాంబ టెంపుల్ – శ్రీరంగపట్నం (కర్ణాటక)

కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరిలో పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం వెలసి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరుకి ముఖ్య ఆధారం కావేరి నది. సాధారణంగా జీవుల దాహార్తిని తీర్చే కావేరి నది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే శ్రీవైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగం క్షేత్రం మరియు శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఈ పవిత్ర ప్రదేశంలోనే వెలసిన పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు. అలాగే పార్వతీ దేవి అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి సంబంధించిన ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుడిని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు.

వైష్ణో దేవి ఆలయం – జమ్మూ

హిందువులకు సంబంధించి అత్యంత పవిత్రమైన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్‌లోని త్రికూట కొండలపై ఉంటుంది. దీనిని శ్రీమాతా వైష్ణోదేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళీ త్రిమూర్తుల సమ్మేళనంగా ఉంటుంది. వైష్ణో దేవి మహాలక్ష్మి యొక్క అవివాహిత రూపం. ఆమెలో మహాసరస్వతి, మహాకాళి అంశాలు కూడా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన శక్తిపీఠం. భక్తులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం.

స్వర్ణ దేవాలయం – అమృత్‌సర్‌

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (Golden Temple Amritsar) సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గోపురం స్వచ్ఛమైన బంగారంతో పూత పూయబడింది. ఇది అమృత్‌ సరోవర్‌ అనే పవిత్ర కొలను చుట్టూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వంటశాల (లంగర్‌) కూడా ఉంటుంది. ఇది సిక్కుల సమానత్వ, సేవాభావాలకు ప్రతీకగా చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సిక్కు సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు ప్రతిరూపం.

శ్రీ బాలాజీ టెంపుల్ (తిరుమల)

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Balaji Temple Tirumala) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుమల శేషాచల కొండలపై వెలసి ఉంది. ఈ పవిత్ర హిందూ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు. దీనిని తిరుపతి బాలాజీ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం – ఉజ్జయిని

ఉజ్జయినిలో వెలసిన ప్రసిద్ధ కృతయుగం నాటి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. సప్త మోక్ష ధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవుగా ఉంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద షిప్రా నది ఒడ్డున వెలసిన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసియున్న శివుడిని మహాకాళుడిగా వ్యవహరిస్తారు. ఈ మహాకాళుడుని కాలానికి మరియు మరణానికి దేవుడిగా భావిస్తారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన లింగం స్వయంభువు లింగం. ఈ మహా క్షేత్రంలో వెలిసిన శివలింగం ఇతర లింగాల వలె కాకుండా మంత్ర శక్తులతో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. అందుకే ఇక్కడి మహాకాళేశ్వరుడి దర్శనం భయం మరియు పాపాల నుండి విముక్తిని కలిగిస్తుందని చెబుతారు.

సిద్ధి వినాయక టెంపుల్‌ – ముంబై

సిద్ధిని బుద్ధిని ప్రసాదించే వినాయకుడు ఆగ్రహ ఆవేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. దేవతలకు సహాయం అందించడమే కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం అనేది గణపతి యొక్క గొప్పతనం. సమస్త దేవతలచే పూజలు అందుకునే శ్రీమన్నారాయణుడే గణపతికి ఆలయాన్ని నిర్మించాడంటే వినాయకుడి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఖ్యాతి కలిగిన గణపతికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే.. ముంబైలోని ప్రభాదేవిలో ఉండే శ్రీసిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రత్యేకమైనది. ఈ గణపతి క్షేత్రాన్ని దర్శిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగి విజయాలు చేకూరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా గణేశ్‌ నవరాత్రుల వేళ ఈ ఆలయం బహు సందడిగా ఉంటుంది.

కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ – వారణాసి

ఇది వారణాసిలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ కాశి వారణాసి నగరం అతి పురాతన నగరాల్లో ఒకటి. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్‌ అని కూడా అంటారు. తెలిసీ తెలియక మనం చేసిన పాపాలకు సంబంధించి ప్రాయశ్చిత్తం పొంది ఆ పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని వద్ద ఉన్న గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు.

సూర్య దేవాలయం – కోణార్క్‌

ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయం పెద్ద రథం ఆకారంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంటుంది. సూర్య దేవాలయంతో పాటు అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్తరాంగ్ బీచ్‌ కూడా అద్భుతమైన సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్‌లో సూర్యాస్తమయం చూడడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కోణార్క్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక శిల్పాలు, ఇతర నాగరికతల అవశేషాలను సైతం చూడవచ్చు.

 

  Last Updated: 12 Dec 2025, 11:06 AM IST