HYD: జూబ్లీహిల్స్, హిమాయ‌త్ న‌గ‌ర్‌ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 12:22 PM IST

HYD: హైద‌రాబాద్ హిమాయత్ న‌గ‌ర్‌లోని బాలాజీ భవన్‌లో గ‌ల శ్రీ వేంక‌టేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ డెప్యూటీ ఈవో ర‌మేష్ బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 1 గంట నుండి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగశ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. సర్వదర్శనం ఉదయం 3.30 గంటలకు ప్రారంభమ‌వుతుంది. విఐపిలు, ప్రోటోకాల్ ప్ర‌ముఖులు 3 గంటలకు రిపోర్టు చేయాలి. సాయంత్రం 6 నుండి 6.45 గంటల వరకు నైవేద్య విరామ సమయం ఉంటుంది. తిరిగి 6.45 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమ‌వుతుంది.

డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5 నుండి 6 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 6 నుండి 7 గంటల వరకు తోమాల, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.   డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున వేకువజామున 1 గంట నుండి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగశ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఉదయం 3.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమ‌వుతుంది. విఐపిలు, ప్రోటోకాల్ ప్ర‌ముఖులు ఉద‌యం 3 గంటలకు రిపోర్టు చేయాలి. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు నైవేద్య విరామం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమ‌వుతుంది. విఐపిలు, ప్రోటోకాల్ ప్ర‌ముఖులు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టు చేయాలి.

డిసెంబ‌రు 24న వైకుంఠద్వాదశి సందర్భంగా ఉదయం 5 నుండి 6 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు తోమాల, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఈ ప‌ర్వ‌దినం కార‌ణంగా డిసెంబ‌రు 23న ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.