TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

TTD : రాష్ట్రంలో మూడు కొత్త టీటీడీ ఆలయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు

Published By: HashtagU Telugu Desk
BR Naidu

BR Naidu

తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుండి ఒక శుభవార్త వచ్చింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు కొత్త టీటీడీ ఆలయాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్, దుబ్బాక, మంథని ప్రాంతాల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రతను కాపాడడమే కాకుండా, సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి అనేక సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. తెలంగాణలో కొత్త ఆలయాల నిర్మాణం ద్వారా తిరుమల వైభవాన్ని మరింత మంది భక్తులకు చేరవేయాలన్నదే టీటీడీ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల లడ్డూ నాణ్యత మరింత మెరుగుపడిందని తెలిపారు. భక్తులు ఇప్పుడు లడ్డూలు 10 రోజుల పాటు తాజాగా ఉంటున్నాయని, వాసన రానందని ప్రశంసిస్తున్నారని అన్నారు. అన్నప్రసాదం నాణ్యతను పెంచడం కోసం అత్యుత్తమ పదార్థాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. భక్తులకు శుభ్రమైన వసతులు కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. తిరుపతి ప్రాంత ప్రజలకు కృతజ్ఞతగా ప్రతి నెల మొదటి మంగళవారం రోజున 3,000 మంది స్థానిక భక్తుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తిరుమలతో అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, స్థానికుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక టీటీడీ వ్యవస్థలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటివరకు వ్యక్తుల పేర్లతో ఉన్న కాటేజీల విధానాన్ని రద్దు చేసి, ఇకపై వాటికి దేవతామూర్తుల పేర్లు పెట్టనున్నట్లు తెలిపారు. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జరిగిన అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగుతోందని, తప్పు చేసినవారిపై ఎటువంటి రాయితీ ఇవ్వబోమని హెచ్చరించారు. తిరుపతి విమానాశ్రయానికి “శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయం” అనే పేరు పెట్టే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అలాగే శ్రీవాణి ట్రస్టు రద్దు అవుతుందనే వార్తలను ఖండిస్తూ, ఆ ట్రస్టు కొనసాగుతుందని చెప్పారు. తిరుమల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఔషధ వనాలు, పవిత్ర తోటలను అభివృద్ధి చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇది ఆలయ సంప్రదాయాలను, పర్యావరణ పరిరక్షణను సమానంగా బలోపేతం చేస్తుందని నాయుడు పేర్కొన్నారు.

  Last Updated: 06 Nov 2025, 03:37 PM IST