Masa Shivaratri : ఇవాళ మాస శివరాత్రి. ఈ రోజు శివుడిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదని పెద్దలు అంటారు. అల్ప ఆయుష్కుడైన మార్కండేయుడు శివుడిని ఆరాధించి సంపూర్ణ ఆయుష్షును పొందాడు. మాస శివరాత్రి రోజు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజితే మన గండాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం శివపూజ దోహదం చేస్తుందని చెబుతున్నారు. కొంతమందికి రాహు కేతు గ్రహాల దోషాల కారణంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాంటి వారు కూడా మాస శివరాత్రి(Masa Shivaratri) పూజ చేసి ఆయా దోషాల నుంచి విముక్తి పొందొచ్చని సూచిస్తున్నారు. దీంతోపాటు గురు గ్రహం అనుగ్రహం కూడా లభిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
మాసశివరాత్రి సందర్భంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటలలోపు శివుడికి పూజ చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. శివుడి జన్మ తిథి చతుర్దశి ఈ రోజు వచ్చినందున.. మాస శివరాత్రి పూజలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. పండితుల కథనం ప్రకారం.. మాస శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే శివాలయానికి వెళ్లి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇవాళ రోజంతా నీటిని తాగుతూ ఉపవాసం చేయాలి.
సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివాలయంలో శివలింగానికి పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకం చేయాలి. అష్టోత్తర శత నామాలతో శివుడికి పూజ చేయాలి. పండ్లు, కొబ్బరికాయలు, పులిహోరను నైవేద్యాలుగా సమర్పించాలి. అనంతరం ఇంటికి వచ్చి ఉపవా సం విరమించాలి. ఇవాళ అన్నదానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదంటే కనీసం ఒక్కరికైనా భోజనం పెడితే మంచిది.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.