Simhachalam: సింహాచలం స్వామి ప్రత్యేకత ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

  • Written By:
  • Updated On - April 30, 2022 / 11:58 AM IST

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన రాష్ట్రాలలో ఉన్న మిగతా నరసింహస్వామి ఆలయాలలో కన్నా ఈ సింహాచలంలో ఉన్న ఆలయం ఎంతో భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాలలో మనకు స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తే సింహాచలంలో మాత్రం లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న లింగరూప లక్ష్మీనరసింహస్వామి ఎల్లప్పుడు చందనంతో నిండుగా పూయబడి ఉంటుంది. అసలు ఈ ఆలయంలో స్వామి వారు ఎందుకు లింగరూపంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న స్వామివారికి చందనం ఎందుకింత ప్రీతికరమో ఇక్కడ తెలుసుకుందాం.

మన పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నవ నరసింహ స్వామిని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. రాక్షసుడైన హిరణ్యకశిపుడు స్తంభంలో స్వామివారిని చూపించమని స్తంభం పగల కొడుతున్న సమయంలో అందులో నుంచి విష్ణుమూర్తి  నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరిస్తానని మనకు తెలిసిన విషయమే.  ఈ విధంగా ప్రహ్లాదుడు తనకోసం ప్రత్యక్షమైన నారసింహుని మొట్ట మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

సింహాచలంలో నరసింహ స్వామిని ప్రతిష్టించినది ప్రహ్లాదుడు అని పురాణాలు చెబుతున్నప్పటికీ ఆలయాన్ని నిర్మించినది మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఒకరోజు పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో అక్కడ నేలలో కప్పబడి పోయిన స్వామి వారి విగ్రహం బయటపడింది. ఆ సందర్భంగా ఆ రాజు స్వామి వారి కోసం సింహాచలంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది. అదే సమయంలోనే ఆకాశవాణి ఆ రాజుకు ప్రతి రోజు స్వామివారికి చందనం పూత పూయాలని చెప్పగా, ఆకాశవాణి పలుకుల మేరకు అప్పటి నుంచి స్వామివారిని నిత్యం చందనంతో అలంకరిస్తారు. అలా అప్పట్లో మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి చందనం పూత ఉండదు. మిగిలిన రోజులన్నీ స్వామివారు చందనం పూతతోనే భక్తులకు దర్శనమిస్తారు.