Rudraksha: రుద్రాక్ష మాలను ధరించటానికి కార్తీక మాసం, మహాశివరాత్రి రోజు, సోమవారం రోజు అత్యుత్తమమైనవి. రుద్రాక్షధారణకు ముందు నువ్వుల నూనెలో గాని ఆవునెయ్యిలో గాని ఒకరోజు ఉంచి తరువాత మాలను శుభ్రమైన పొడి గుడ్డతో తుడచి పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలతో నీరాజనాలనంతరం రుద్రాక్షను గాని మాలను గాని “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రుద్రాక్షలను, మాలని ధరించాలి.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.
రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంటుంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా, స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండకూడదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పాదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు.