చాలా రకాల పంచారామ క్షేత్రాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వాటిలో సోమారామం కూడా ఒకటి. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి. ఇది రాజమండ్రికి 59 కి.మీ. దూరంలో, విజయవాడకు 91 కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 2 కి.మీ. దూరంలో ఉంది. కాగా ఈ సోమారామంలో లింగమును చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా ఆలయ స్థల పురాణం చెబుతోంది. సోముడు అంటే చంద్రుడు. చంద్ర ప్రతిష్ఠిత లింగం కాబట్టి ఈ క్షేత్రాన్ని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. సోమారామంలో ప్రతి కార్తికమాసంలో ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయట.
భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడట. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు వర్ణంలోను అలాగే పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. చంద్రుడు ప్రతిష్టించిన కారణంగానే, ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగుమారుతూ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇది శతాబ్దకాలంగా జరుగుతోందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ, పక్కన పార్వతి దేవి అమ్మవారు ఉంటారు. పై అంతస్తులో అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠితమై ఉంటారట. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతున్నారు.
ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి. దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది. అలా ఈ ఆలయంలో మొత్తం 5 నందులు ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పేరు కూడా వచ్చింది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచలవుతాయని చెబుతున్నారు. ఇకపోతే ప్రతి ఏడాది ఈ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు ఘనంగా జరుగుతాయ. అలాగే దేవీనవ రాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారట. ఇక కార్తీకమాసంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి శివలింగం రంగులు మారడం వెనుక ఉన్న మిస్టరీ ఇప్పటికి చేధించలేకపోయారని చెబుతున్నారు.