Site icon HashtagU Telugu

Navaratri 2024: నవరాత్రుల సమయంలో ఇంటికి ఎలాంటి వస్తువులు తెస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

Navaratri 2024

Navaratri 2024

నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నాడు ప్రారంభం అవుతాయి. ఈ శరన్నవరాత్రులు 9 రోజుల పాటు జరుగనున్నాయి.
ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా దేవికి భక్తి శ్రద్దలతో పూజలు కూడా చేయనున్నారు. ఈ తొమ్మిది రోజులూ భక్తులు ఉపవాసం ఉండి, దేవాలయాలను సందర్శించి.. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇకపోతే ఈ ఏడాది తిథి అక్టోబర్ 3 న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అక్టోబర్ 4 తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం, అక్టోబర్ 3, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల సమయంలో కొన్ని రకాల వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిదట.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రి సమయంలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చొని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు.. అలాగే నవరాత్రులలో ఇంటికి వెండి నాణెం తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణెం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నాణేన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం.

అలాగే నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ వంటివి తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచడం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మిదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రులలో ఇంట్లో తామర పువ్వును తెచ్చి పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించాలనీ చెబుతున్నారు. అదేవిధంగా నవరాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదట. నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నుడవుతారని నమ్ముతారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీ దేవి ఇంట్లో నివసిస్తుందట. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని చెబుతున్నారు.

Exit mobile version