Ratha Saptami: రథ సప్తమి రోజున నదీ స్నానం, రథం ముగ్గు, జిల్లేడు ఆకులు.. వీటి వల్ల కలిగే ఫలితాలివే?

రేపే రథసప్తమి. తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి అధిపతి. తిధుల్లో ఏడవ తిథి సప్తమి. సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువం

  • Written By:
  • Updated On - February 15, 2024 / 10:12 PM IST

రేపే రథసప్తమి. తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి అధిపతి. తిధుల్లో ఏడవ తిథి సప్తమి. సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి భాస్కరుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి సూర్యుడి పుట్టిన రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతి కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కనుక రథ సప్తమి రోజున సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేస్తారు. సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేసి పూజను చేస్తారు.

అంతేకాకుండా రథసప్తమి రోజున ఇంకా కొన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. మరి అలా చేయడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటారట. ఈ పవిత్రమైన రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. సూర్యోదయానికంటే ముందే నది స్నానం చేయడం వలన సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు, రేగు పండ్లు తలమీద పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది.

సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి రోజున మాత్రమే కాదు ప్రతిశుద్ధ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. రథసప్తమి రోజున సూర్యోదయాని కంటే ముందే స్నానం చేయాలి. అనంతరం ఆరుబయట తూర్పు దిక్కున దీపం పెట్టాలి. శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని లేదా చిక్కుడు కాయలతో, కొబ్బరి పుచ్చులతో రథాన్ని తయారు చేసి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. పీఠం ఏర్పాటు చేసి కొత్త గుడ్డని పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట ఏర్పాటు చేసి ఆవు పాలతో చెరకుతో పరమాన్నం తయారు చేసి ఆ క్షీరాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ సూర్యభగవానుడు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఆయన అనుగ్రహం కలుగుతుంది. దాంతో మీరు పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు.