Shivalayam Pradakshina: ఏ ఆలయానికి వెళ్లినా.. ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాం. 3,5,9,11 ఇలా మన శక్తి మేరకు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దైవదర్శనానికి వెళ్తాం. అయితే.. ఇతర దైవీదేవతల ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకంటే.. శివాలయంలో చేసే ప్రదక్షిణలకు కొన్ని నియమాలు, ప్రత్యేకతలున్నాయి. ఈ నియమాల ప్రకారం ఆ భోళాశంకరుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే.. అనంతమైన పుణ్యాన్ని సాధించవచ్చని లింగపురాణం చెబుతోంది. ఆ నియమాలేంటో తెలుసుకుందాం.
శివాలయంలో చేసే ప్రదక్షిణను చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టి.. చండీశ్వరుని వరకూ వెళ్లి.. అక్కడ చండీశ్వరుడిని దర్శించుకుని తిరిగి మళ్లీ ధ్వజస్తంభం వద్దకు చేరుకోవాలి. ధ్వజస్తంభం వద్ద ఒక్క క్షణం ఆగి.. మళ్లీ ప్రదక్షిణను ప్రారంభించి.. సోమసూత్రం (అభిషేక జలం బయటికి వెళ్లే ఆవుముఖం) వరకూ వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి మళ్లీ నందీశ్వరుని చేరుకుంటే.. ఒక శివ ప్రదక్షిణను పూర్తిచేసినట్లు.
ఇలా మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ సమయంలో సోమసూత్రాన్ని దాటి ముందుకి వెళ్లకూడదు. సోమసూత్రం నుంచి అభిషేక జలం బయటికొస్తుందనీ, ఇక్కడ శివుని ప్రమధగణాలుంటాయని నమ్మకం. దానిని దాటి ముందుకు వెళ్లి చేసే ప్రదక్షిణ ఫలితాన్నివ్వదని లింగపురాణం చెబుతోంది. సాధారణంగా.. మొక్కులు తీర్చుకునేందుకు ఆలయాలు చుట్టూ చేసే 10 వేల ప్రదక్షిణలు.. ఒక్క చండి ప్రదక్షిణతో సమానం. శివయ్య దర్శనానికి వెళ్లినపుడు తెలిసి, తెలియక కూడా శివునికి – నందికి మధ్యలో నడవరాదు. నందీశ్వరుడి వెనుక నుంచి మాత్రమే వెళ్లాలి.