Bala Tripura Sundari Devi: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 5 వరకు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే.. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో మహిమాన్వితమైన బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉంటుంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది.
త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. ఈరోజు అమ్మవారు త్రిపురా సుందరీ అంశ నుండి పుట్టినటువంటి 9 ఏళ్ళ బాలికగా ఈ అవతారాన్ని తెలియజేస్తారు. శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు చిన్న వయసులోనే తల్లి సహాకారముతో అనేకమంది రాక్షసులను అమ్మవారు సంహరించారు. ఈరోజు బాలత్రిపుర సుందరి దేవిని ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు. నేడు పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజించి కొత్త బట్టలు పెడతారు.
ఈరోజు బాల త్రిపురాసుందరి దేవిని అష్టోత్తర శతనామావళితో పూజిస్తారు. ఈ రోజు బొమ్మలకొలువు పెట్టడం చాలా మంచిది. సాయంత్రం పూజలో అమ్మవారికి దీపారాధన చేసి ఇంటిలో ఆవునేతితో దీపాలను వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని శ్రీమత్రే నమ: అనే మంత్రంతో 108 సార్లు జపించి కర్పూర హారతితో పూజించాలి. దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి.