Site icon HashtagU Telugu

‎Karthika Masam: కార్తీకమాసంలో నారికేళ దీపం ఎందుకు వెలిగిస్తారు.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Karthika Masam

Karthika Masam

‎Karthika Masam: కార్తీకమాసం అంటే శివకేశవులు ఇద్దరికీ పరమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటివి ఎక్కువ ఫలితాలు కలిగిస్తాయట. కాగా కార్తీకమాసంలో ఇంటి వద్ద, దేవాలయాల వద్ద కార్తీకదీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే కార్తీకంలో మాములు దీపాలతో పాటు నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెబుతున్నారు.

‎శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయట. మరి కార్తీక మాసంలో నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలో, అలా వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేళ దీపాన్ని కార్తికమాసంలో ఏ రోజైనా ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతున్నారు. కార్తిక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు. ఎలా వెలిగించాలి అన్న విషయానికి వస్తే..

‎పూజా మందిరాన్ని ముందుగా చక్కగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించాలి. శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్లెంను ఉంచాలి. ఆ పళ్లెంకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్​లోకి గంధం తీసుకోవాలి. అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్​ గుర్తు రాయాలి.

‎ ఆ స్వస్తిక్​ గుర్తుకు నాలుగు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ స్వస్తిక్​ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. తర్వాత కొబ్బరికాయను తీసుకుని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలకొట్టాలట. ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్లెంలోని బియ్యం మీద ఉంచాలి. ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి.
‎ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి. ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తీతో వెలిగిస్తూ “దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ” అనే మంత్రాన్ని 21 సార్లు పటించాలి.

‎నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ‎ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలకరించాలి. అక్షతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను, దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు. అలాగే పళ్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగళిగా చేసుకుని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలని చెబుతున్నారు.

Exit mobile version