ద్వారకాధీశ్ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఉంది. ఈ ఆలయంలో కృష్ణుడు నలుపు రంగులో దర్శనమిస్తాడు. ఇది శ్రీకృష్ణుడు జన్మించిన యమునా నది ఒడ్డున ఉన్న జైలు గదిలో ఉంది. ఈ ఆలయంలోని గదిలోనే శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ ఆలయం నిర్మాణశైలి కమనీయంగా ఉంటుంది.
శ్రీ బాంకే బిహారీ దేవాలయం ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఉంది. శ్రీ కృష్ణ భగవానుడు మధురలో పుట్టినప్పటికీ, ఆయన బాల్యమంతా బృందావనంలోనే గడిచింది. శ్రీ కృష్ణ భగవానుడిని ఇక్కడ బాంకే బిహారీ అని పిలుస్తారు. అందుకే దీనికి శ్రీ బాంకే బిహారీ దేవాలయం అనే పేరొచ్చింది. బృందావన్లో ఇస్కాన్ ఆలయం, ప్రేమ మందిరం, బాంకే బిహారీ ఆలయం చూడదగినవి.
ఉడిపి శ్రీ కృష్ణ మఠం ఆలయం కర్ణాటకలోని ఉడిపిలో ఉంది. దీన్ని వైష్ణవ సన్యాసి శ్రీ మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న తొమ్మిది రంధ్రాల ద్వారా భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. అందుకే దీన్ని అద్భుత కిటికీగా పిలుస్తారు. ఇక్కడ కన్నయ్య దర్శనం కోసం భక్తులు 4 గంటల పాటు వేచి ఉండాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి.
ద్వారకాధీష్ ఆలయం గుజరాత్లోని ద్వారకలో ఉంది.ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మతానికి సంబంధించిన చార్ ధామ్ లలో ఒకటి. ఈ దేవాలయం గోమతి ఘాట్ మీద ఉంది. దీన్ని 43 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించకపోతే చార్ ధామ్ యాత్ర సంపూర్ణం కానట్లుగా భావిస్తారు.
పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒడిశాలోని పూరి పట్టణంలో ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర వరల్డ్ ఫేమస్. ఇది హిందూ మతపరంగా చాలా ముఖ్యమైనది. ఈ రథయాత్రలో జగన్నాథుని రథాన్ని లాగడానికి లక్షలాది భక్తులు వస్తుంటారు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, తన సోదరి, అన్నతో కలిసి చేసే ప్రయాణం కోసం మూడు భారీ రథాలను సిద్ధం చేస్తారు. ఈ ప్రయాణంలో బలరాముడు అధిరోహించే రథం ముందు వరుసలో ఉంటుంది. అనంతరం సోదరి సుభద్ర రథం.. శ్రీకృష్ణుడి రథం ప్రయాణిస్తాయి.