ఒడిశాలో అతిపెద్ద పండుగలో ఒకటైన పూరి జగన్నాథ్ రథయాత్ర ఒకటి. పూరి జగన్నాథ్ ఆలయం గురించి ఆలయ రహస్యాల గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఒక మిస్టరీ ఎప్పటికీ అలానే ఉండిపోయింది. ఈ ఆలయంపై పక్షులు అసలు ఎగరవని చెబుతారు. జగన్నాథుడికి వాహనంగా గరుడ దేవుడు ఉంటాడని, గరుడ దేవుడే ఆలయాన్ని కాచుకుని ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు.
అందుకే పక్షులు ఇక్కడ ఎగిరేందుకు భయపడతాయనీ అంటారు. ఇక విమానాలు కూడా ఈ ఆలయం మీదుగా వెళ్లవట. ఇందుకు గల కారణం ఈ ఆలయం ఫ్లైయింగ్ రూట్లో లేకపోవటమే. అంటే ఈ ఆలయం మీదుగా ఏ మార్గానికీ వెళ్లే అవకాశం లేదు. అందుకే విమానాలు ఆ చుట్టుపక్కల కనీసం దరిదాపుల్లో కూడా కనిపించవు. ఇందుకు మరో కారణాన్ని కూడా చెబుతారు. ఆలయ శిఖరాన మెటల్ తో తయారు చేసిన చక్రాన్ని ఉంచారు. ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ను అడ్డుకుంటుంది.
ఇక్కడ విమానాలు ఎగిరితే ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా ఫ్లైయింగ్ జోన్ లేకుండా చూసుకున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఆలయ శిఖరంపైన ఉండే చక్రం దాదాపు 20 అడుగులు ఎత్తుంటుంది. సిటీలో ఏ మూల నుంచి చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆలయం పైన ఉండే జెండా, గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఊగుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.