Liquor Offering To God : మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న కాల భైరవ దేవాలయంలో శివునికి నైవేద్యంగా ఏం సమర్పిస్తారో తెలుసా ? 6000 సంవత్సరాల ఈ పురాతన ఆలయంలోని కాల భైరవుడికి భక్తులు మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మద్యంతో పాటు మాంసం, చేపలు, ధాన్యం వంటి పంచమక్ర అనే తాంత్రిక సమర్పణలను కూడా ఇక్కడ దేవుడికి సమర్పిస్తారట. ఇక్కడ స్వామివారికి సమర్పించిన మద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఇదంతా విచిత్రంగా అనిపించినా.. ఇది అక్కడి ఆచారంలో భాగం. ప్రస్తుతానికి దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని స్వీకరిస్తున్నామని.. మాంసం, చేపలు, ధాన్యం తీసుకోవడం లేదని పూజారులు తెలిపారు. ‘‘ భక్తులు సమర్పించేే మద్యం సీసాలోని కొంత మొత్తాన్ని ఓ గిన్నెలో పోసి దేవుడి పెదాల వద్ద ఉంచుతాం. అప్పుడు ఆ గిన్నెలోని మద్యం కాస్తా కనుమరుగవుతుంది. తర్వాత మిగిలిన మద్యం సీసాను ప్రసాదంగా భక్తులకే తిరిగి ఇస్తాం’’ అని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఆలయం వెలుపల ఉన్న దుకాణాల్లో పూజా సామాగ్రితో పాటు మద్యం బాటిళ్లను కూడా అమ్ముతుంటారు. ఈ ఆలయంలో దేవుడికి పూలు, పండ్లు, కొబ్బరి కాయలతో పాటు మద్యం సీసాను కూడా సమర్పిస్తారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2015లో ఈ ఆలయం దగ్గర ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణం తెరిచింది. భక్తులకు తక్కువ రేట్లకు మద్యం బాటిల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ చర్యను చేపట్టింది. ఈ ప్రభుత్వ బార్ లో విదేశీ మద్యం బ్రాండ్ బాటిళ్లు కూడా లభిస్తాయి. ధనికులైన భక్తులు ఫారిన్ బ్రాండ్లను కొని శివుడికి నైవేద్యంగా (Liquor Offering To God) సమర్పిస్తుంటారు.