Indira Ekadashi 2022: ఇందిర ఏకాదశి రోజు ఈ 5 కార్యాలు చేస్తే.. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి!!

హిందువులు ప్రతి నెలా రెండు ఏకాదశులను జరుపుకుంటారు. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 08:15 AM IST

హిందువులు ప్రతి నెలా రెండు ఏకాదశులను జరుపుకుంటారు. ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అయితే ప్రస్తుతం పితృ పక్ష సమయం నడుస్తోంది. పైగా అశ్వినీ మాసం. ఈ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని ఇందిర ఏకాదశి అంటారు. పితృ పక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా వారికి మరణానంతరం మోక్షం లభిస్తుందట. హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి 09:26 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 21 బుధవారం రాత్రి 11:34 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం సెప్టెంబరు 21న ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉంటుంది. ఇందిరా ఏకాదశి మరుసటి రోజు సెప్టెంబరు 22వ తేదీ ఉదయం 06:09 నుండి 08.35 గంటల మధ్య ఉపవాసం చేయడం మంచిది. ఇందిరా ఏకాదశి రోజు చేయాల్సిన 5 ముఖ్య కార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందిరా ఏకాదశి వ్రతం

ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు యమలోకం నుండి విముక్తి పొందుతారు. శ్రాద్ధ పక్షం/పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి పుణ్యాన్ని పూర్వీకులకు సమర్పిస్తే నరకానికి వెళ్లిన పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని చెబుతారు.

* తులసి చుట్టూ 11 ప్రదక్షిణలు

ఇందిరా ఏకాదశి రోజు సూర్య అస్తమయం సమయంలో తులసి మొక్క సమక్షంలో నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల మీ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో సుఖ శాంతులు విలసిల్లుతాయి.

* విష్ణుమూర్తి కి పూజ

బాగా అప్పుల్లో మునిగిపోయిన వారు ఇందిరా ఏకాదశి రోజు విష్ణుమూర్తి కి పూజలో పసుపు రంగు పూలు, పసుపు రంగు పండ్లు, పసుపు రంగు ధాన్యం సమర్పించాలి. పూజ అనంతరం ఈ సామగ్రిని పేదలకు పంచి పెట్టండి.ఇలా చేయడం వల్ల మీ అప్పుల భారం తగ్గేందుకు దారులు తెరుచుకుంటాయి.

* రావిచెట్టు లో దీపాలు

ఇందిరా ఏకాదశి రోజు రావిచెట్టు లో ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి.దీనివల్ల చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. మన దరిద్రం కూడా నశిస్తుంది.

* ఇంట్లో విష్ణు సహస్ర నామ పఠనం

ఇందిరా ఏకాదశి రోజు ఇంట్లో విష్ణు సహస్ర నామ పఠనం చేయాలి. దాని భజన, కీర్తన చేయాలి. ఈ కార్యక్రమం వల్ల ఇంట్లోని నెగెటివిటీ వెళ్ళిపోతుంది. ఇంట్లో గొడవలు జరగవు. మీరు చేసే పనులు సిద్ధిస్తాయి.