మామూలుగా లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది. శుక్రవారం రోజు లక్ష్మి దేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. శుక్రవారం రోజు లక్ష్మి దేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, ఇంట్లో సిరిసంపదలకు కూడా లోటు ఉండదని చెబుతున్నారు. శుక్రవారం పూజ చేయడం సహజమే కానీ కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో పూజించడం వల్ల అనేక రకరకాల సమస్యలు తొలగిపోతాయట. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఎలా పూజ చేస్తే మంచి జరుగుతుంది అన్న విషయానికి వస్తే..
దృష్టి దోషాలు తొలగడం కోసం ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయాలట. అలాగే ఇల్లు తుడిచే నీటిలో కూడా ఉప్పు వేసి తుడవడం వల్ల నరఘోష, దృష్టి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఉపవాసం ఉండడం కూడా మంచిదని చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చట. ఈ విధంగా ఉపవాసం చేసి లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు.
అలాగే సిరిసంపదలు ఆకస్మిక ధన లాభాలు కోరుకునేవారు శుక్రవారం రోజు 108 తామర పువ్వులతో లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజిస్తే సిరిసంపదలు తాండవిస్తాయట. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన బియ్యం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం చేకూరుతుందట. ఎవరైనా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే వారు శుక్రవారం బ్రాహ్మి ముహూర్తంలో తమ ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడతారట. జీవితంలో వీరికి ఎన్నడూ డబ్బుకు లోటు ఉండదని చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవట. అలాగే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన ఇంట్లో సుఖ శాంతులు, ఐశ్వర్యం కలుగుతుందట. శుక్రవారం దీపాలు పెట్టే వేళ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం వలన ఆ ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుందట.