తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు గజరాజులు, అశ్వాలు, వృషభాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో ఇవి కీలకపాత్ర పోషిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్వామివారి వాహనసేవల్లో తొలి అడుగు వీటిదే ఉంటుంది. భక్తులకు ముందుగా ఇవే కనువిందు చేస్తాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ జంతువులు ఠీవిగా ముందుకు నడుస్తూ స్వామివారు వస్తున్నారన్న సంకేతాలు ఇస్తాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో గజవాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
స్వామి వారి సేవలో తరిస్తున్న గజరాజు శ్రీనిధి వయసు 14 ఏళ్లు కాగా, లక్ష్మీకి 45 ఏళ్లు ఉంటాయి. వాహన సేవల కోసం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.వాటికి శిక్షణ ఇప్పించేందుకు కేరళ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించారు. బ్రహ్మోత్సవాలకు వీటి రాకతో ప్రత్యేక కళ సంతరించుకుంటుందని టీటీడీ అధికారులు చెప్పారు. శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో వీటి ఆలనా పాలనా చూస్తుంటారు. తిరుమల గోశాలను మరింత అభివృద్ధిపరిచేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
Tirumala Brahmotsavam Vahanam schedule pic.twitter.com/i5sCIrfGky
— GoTirupati (@GoTirupati) September 17, 2022