మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు వాస్తు దోషాలు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. వాస్తు దోషాల కారణంగా మనం అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి అవ్వవు. అలాగే ఈ వాస్తు దోషాలు వల్ల ఆరోగ్యపరంగా మానసికపరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏ ఇల్లు కూడా త్రికోణాకారం అలాగే విసనకర్ర ఆకారం, యు ఆకారంలో ఉండకూడదట. ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తు దోషాలు కలిగిన గృహంగా భావించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహ ద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. అలా వస్తే ఆ ఇంటికి వాస్తు దోషం ఎక్కువగా ఉంటుందట. అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి. అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కేవిధంగా ఉండాలి. లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఎక్కేలా మెట్లు ఉండాలని అంటున్నారు. అదేవిధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట. వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడి కాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి. లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి.
అప్పుడు ఆ ఇంట్లో వాస్తు దోషాలనేవి ఉండవట. అదేవిధంగా ఏ ఇంటికైనా సరే తూర్పు, ఉత్తర దిశలు మూత పడకుండా చూసుకోవాలి. ఒక గృహానికి తూర్పు మూసుకుపోయినా, ఉత్తరం క్లోజ్ అయినా వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు. అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలంటున్నారు. తూర్పు, పడమర, ఉత్తర సింహ ద్వారం ఉన్న ఇంట్లో ఉండడం మంచిదట. ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయని అంటున్నారు. కాగా తూర్పు సింహ ద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం మూటకట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహ ద్వారానికి వేలాడదీయాలి. ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగించుకోవచ్చట.
పడమర సింహ ద్వారం ఉంటే నీలం రంగు క్లాత్ లో గుప్పెడు బియ్యం, అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు, కాస్త కర్పూరం వేసి మూటకట్టి దాన్ని శనివారం ఉదయం ఆ పడమర సింహ ద్వారానికి కట్టాలి. ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకొని మూటకట్టాలి. దాన్ని బుధవారం ఉదయం మీ సింహ ద్వారానికి తగిలించాలట. ఇలా చేయడం ద్వారా ఆ గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవడం మంచిదట. కాబట్టి ఇలా సింహ ద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను పొందవచ్చంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.